హాంకాంగ్ పై చైనా పట్టు.. ఐరాసలో భారత్ ఆందోళన

హాంకాంగ్ పై పట్టుకోసం చైనా వివాదాస్పదమైన జాతీయ భద్రతా చట్టాన్ని తేవడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలే లదాఖ్ సరిహద్దుల్లో చైనా సైనికుల దురాక్రమణతో సమస్యను ఎదుర్కొంటున్న ఇండియా.. హాంకాంగ్ విషయంలో డ్రాగన్ కంట్రీ తెచ్చిన చట్టం పరిస్థితిని మరింత విషమింపజేస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ లోని ఇటీవలి పరిణామాల పట్ల ‘తీవ్రంగా’ దృష్టి సారించాలని ఇండియా ఐక్యరాజ్యసమితిని కోరింది. హాంకాంగ్ లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని ఐరాస లోని […]

హాంకాంగ్ పై చైనా పట్టు.. ఐరాసలో భారత్ ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 2:14 PM

హాంకాంగ్ పై పట్టుకోసం చైనా వివాదాస్పదమైన జాతీయ భద్రతా చట్టాన్ని తేవడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలే లదాఖ్ సరిహద్దుల్లో చైనా సైనికుల దురాక్రమణతో సమస్యను ఎదుర్కొంటున్న ఇండియా.. హాంకాంగ్ విషయంలో డ్రాగన్ కంట్రీ తెచ్చిన చట్టం పరిస్థితిని మరింత విషమింపజేస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ లోని ఇటీవలి పరిణామాల పట్ల ‘తీవ్రంగా’ దృష్టి సారించాలని ఇండియా ఐక్యరాజ్యసమితిని కోరింది. హాంకాంగ్ లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని ఐరాస లోని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి కూడా అయిన రాజీవ్.కె.చందర్ గుర్తు చేశారు. హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ (ఎస్ ఏ ఆర్) పేరిట చైనా ఓ చట్టాన్ని తెచ్చి పార్లమెంటు చేత ఆమోదింపజేసింది. డ్రాగన్ కంట్రీ చేస్తున్న ఈ విధమైన   చర్యల వల్ల ముఖ్యంగా హాంకాంగ్ స్వేఛ్చ, ప్రతిపత్తి హరించుకుపోతాయని భయపడుతున్నామని రాజీవ్ కె.చందర్ అన్నారు. ఈ పరిణామాలను జాగ్రత్తగా తాము గమనిస్తున్నట్టు  పేర్కొన్నారు. సంబంధిత పక్షాలు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలని అభ్యర్థించారు.

హాంకాంగ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ అంచనా ప్రకారం ఇక్కడ 38 వేల మందికిపైగా భారతీయులు ఉన్నారు. తమను విమర్శించేవారిని అణగదొక్కేందుకు చైనా ఈ చట్టాన్ని వినియోగించుకోవచ్చునని అమెరికా, బ్రిటన్, ఈయూ, ఐరాస ఏజన్సీలు కూడా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. హాంకాంగ్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా చేస్తున్న యత్నాలకు నిరసనగా ఈ నగరంలో కొన్ని నెలలపాటు స్థానికులు  తీవ్ర స్థాయిలో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. కాగా- తాము తెచ్చిన చట్టం ప్రకారం.. చైనా.. ఈ వాణిజ్య నగరంలో ఎవరు తమకు వ్యతిరేకంగా పని చేసినా, లేదా విదేశీ శక్తులతో కుమ్మక్కు అయినా వారికి యావజ్జీవ జైలు శిక్ష విధించేందుకు వీలుంది.