Minister KTR: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు మంత్రి కేటీఆర్ లేఖ.. ఇందులో హైదరాబాద్ గురించి ఏం చెప్పారో తెలుసా..
Minister KTR: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఐటీఐఆర్పై (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) స్పందించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశారు.
Minister KTR: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఐటీఐఆర్పై (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) స్పందించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశారు. ఈ లేఖలో భాగంగా పలు విషయాలను ప్రస్తావించారు. 2014 నుంచి ఐటీఐఆర్పై స్పష్టమైన విధానం లేదని, ఇప్పటికైనా ఐటీఐఆర్ను పునరుద్ధరించాలని కోరారు. 2008లో కేంద్రం ఐటీఐఆర్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి అందుకోసం హైదరాబాద్, బెంగుళూరు నగరాలను ఎంపికచేసిందని అన్నారు. 49వేల ఎకరాలతో పాటు మూడు క్లస్టర్లను హైదరాబాద్లో గుర్తించినట్లు చెప్పారు. తద్వారా అనేక నూతన ఐటీ కంపెనీలను నగరానికి రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలకు కేంద్రం అంగీకరించిందన్నారు. సుమారు రూ.3,275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేసిందని తెలిపారు.
మొదటి దశ కార్యక్రమానికి రూ.165 కోట్లతో 2018నాటికి పూర్తి చేయాల్సి ఉందని, మిగిలిన రెండోదశకు వివిధ దశలుగా 20సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ఐతే ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదన్నారు. 2014లో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ ప్రాజెక్టు నమూనాని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని తీసుకొస్తామన్నారు. 2017లో ఇందుకు సంబంధించి ఐటీఐఆర్ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపినా, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాలేదని మంత్రి కేటీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అభివృద్ధి చేయాలని కోరారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు దొరికి నిరుద్యోగిత తగ్గుతుందన్నారు.