రేపే పెద్దల ఎన్నిక.. వైసీపీ, టీడీపీ వ్యూహాలివే

ఓవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఓ ఎన్నికల సందడి నెలకొంది. జూన్ 19వ తేదీ శుక్రవారం అమరావతి పరిధిలోని వెలగపూడి అసెంబ్లీలో ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది. అయితే ఈ ఎన్నికలు ప్రజలందరు పాల్గొనే సాధారణ ఎన్నికలు కావు..

రేపే పెద్దల ఎన్నిక.. వైసీపీ, టీడీపీ వ్యూహాలివే
Follow us

|

Updated on: Jun 18, 2020 | 7:08 PM

ఓవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎన్నికల సందడి నెలకొంది. జూన్ 19వ తేదీ శుక్రవారం అమరావతి పరిధిలోని వెలగపూడి అసెంబ్లీలో ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది. అయితే ఇవి ప్రజలందరు పాల్గొనే సాధారణ ఎన్నికలు కావు.. ప్రజల చేత అసెంబ్లీకి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఓట్లేసే పెద్దల ఎన్నిక. గత మార్చిలో జరగాల్సిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ఈ శుక్రవారం జరగబోతున్నాయి. ఏపీ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది.

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏపీ శాసనసభలోని 175 మంది ఎమ్మెల్యేలు ఓట్లేయబోతున్నారు. సభలో సంఖ్యాబలం ప్రకారం చూస్తే అధికార వైసీపీ మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకోవడం ఖాయం. అయితే.. తగిన బలం లేకపోయినా వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ.. తమ పార్టీని వీడి అధికార పార్టీ పంచన చేరిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తుండడం శుక్రవారం ఎన్నికల ప్రాసెస్‌లో ఏకైక ఆసక్తికర, ఉత్కంఠ రేకెత్తించే అంశం. అందుకే తమ గూటిని వీడిని వారిని కలపుకుని టీడీపీ ఎమ్మెల్యేలందరికీ ఆ పార్టీ విప్ జారీ చేసింది.

ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు బరిలో నిలిచారు. వైసీపీ తరపున రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డిలతోపాటు కార్పొరేట్ దిగ్గజం ముఖేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమళ్ నత్వానీ బరిలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన పార్టీ చీఫ్ విప్ గురువారం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటు ఎలా వేయాలో ఎమ్మెల్యేలకు వివరించారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కో అభ్యర్థికి 38 మంది చొప్పున కేటాయించారు. వారికి సూచించిన అభ్యర్థికి ప్రయోజనం కలిగేలా ఎలా ఓటు వేయాలో వివరించారు.

మరోవైపు కేవలం 23 మంది ఎమ్మెల్యేలే వున్న టీడీపీ వ్యూహాత్మకంగా వర్ల రామయ్యను రాజ్యసభ బరిలోకి దింపింది. 23 మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాల గిరిధర్ రావు ప్రస్తుతం అనధికారికంగా వైసీపీతో కలిసిపోయారు. వారికి వర్తించేలా విప్ జారీ చేసిన టీడీపీ.. వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌కు బలం చేకూర్చేందుకు విప్‌ను వాడుకోబోతంది. అయితే, వారు విధిగా సభకు హాజరై, పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయకపోతే.. విప్ ఉల్లంఘించినట్లుగా భావించి వారిపై మరోసారి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్దమవుతోంది.

శుక్రవారం ఉదయం 9 గంటలకు వెలగపూడి శాసనసభ ఆవరణలో ప్రారంభం కానున్న రాజ్యసభ ఎన్నికల ప్రాసెస్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత గంట విరామం తీసుకుని సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రాత్రికల్లా రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. నలుగురు వైసీపీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుండడంతో గెలిచిన వెంటనే ఇద్దరు మంత్రలు మోపిదేవీ, పిల్లి తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వుంటుంది.