తుది దశకు చేరుకున్న వ్యాక్సిన్ ప్రయోగాలు.. అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన భారత్ బయోటెక్
ప్రపంచాన్ని కుదుపేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ కంపెనీలు టీకా తయారీలో నిమగ్నమయ్యాయి.
ప్రపంచాన్ని కుదుపేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ కంపెనీలు టీకా తయారీలో నిమగ్నమయ్యాయి. వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు చివరి అంకానికి చేరుకున్నాయి. కాగా, ‘కొవాగ్జిన్’ పేరుతో కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్ర డ్రగ్ రెగ్యులేటర్కు దరఖాస్తు చేసింది. ఇప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొవాగ్జిన్ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టీకా మూడో విడత ట్రయల్స్లో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 22వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగిస్తున్నారు.
ఇప్పటికే తొలి, రెండో దశల్లో టీకా మెరుగైన ఫలితాలు రావడంతో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా మూడో విడత ట్రయల్స్కు అనుమతి ఇచ్చింది. ట్రయల్స్ విజయవంతమైతే తర్వాత వ్యాక్సిన్కు ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్లకుపైగా జనం మహమ్మారికి బలయ్యారు. ఈ క్రమంలో పలు టీకాల అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి పలు దేశాలు అనుమతి ఇచ్చాయి. యూకే, బహ్రెయిన్ ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయగా.. ఆ దేశాలు ఆమోదించాయి. భారత్లో ఆ కంపెనీ దరఖాస్తు చేసింది. పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైతం ఈ నెల 6న కొవిషీల్డ్ కోసం దరఖాస్తు సమర్పించింది. దేశంలో పలు టీకాలు అభివృద్ధి చేస్తున్నా.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’ తొలి స్వదేశీ టీకా. కాగా, అత్యవసర వినియోగానికి కంపెనీలు చేసిన దరఖాస్తులను బుధవారం పరిశీలించనున్నట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి.