లాక్డౌన్ వేళ..ఆర్టీసీ ఛార్జీల మోత..ఎక్కడంటే!
కరోనా, లాక్డౌన్ వేళ..అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రజా రవాణాపై భారీగా ఛార్జీల భారం వేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ ఛార్జీలను 25శాతం పెంచుతూ..
కరోనా, లాక్డౌన్ వేళ..అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రజా రవాణాపై భారీగా ఛార్జీల భారం వేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ ఛార్జీలను 25శాతం పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. జ్యుడీషియల్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు కేరళ సర్కారు పేర్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మాట్లాడుతూ..పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని వివరించారు. కనీస ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు. మినిమం ఛార్జీని ఎప్పటిలాగే రూ.8గా నిర్ణయించామని, కనీస దూరాన్ని మాత్రం 5 కిలోమీటర్ల నుంచి 2.5 కిలోమీటర్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు, విద్యార్థుల బస్పాస్ల ఛార్జీలు కూడా పెంచాలని జ్యుడీషియల్ కమిటీ సూచించినట్లు రవాణాశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు మూసే ఉన్నందున స్టూడెంట్ బస్పాస్ ఛార్జీలను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు. కేరళలో ఆర్టీసీలో నెలకొన్న నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం కోసం కేరళ సర్కారు జస్టిస్ ఎం రామచంద్రన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని నియమించింది. కమిటీ సిఫారసులలో ఛార్జీల పెంపు సహా కొన్నింటికి కేరళ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే కమిటీ చేసిన సూచనల మేరకే ఛార్జీలు పెంచినట్లుగా రవాణా శాఖ పేర్కొంది.