అక్కడ మద్యం విక్రయిస్తే రూ.10వేల జరిమానా !
కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామం మాత్రం మద్యానికి దూరంగా ఉంటూ...అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
తెలంగాణలోని అన్ని జిల్లాలో లాక్డౌన్ అమలును అధికారులు, స్థానికులు పక్కాగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరఢా ఝులిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాస్క్ లేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు.. ఓ వైన్స్ షాపు యజమానికి రూ. 5 వేల జరిమానా విధించారు. మాస్క్లులు ధరించిన వ్యక్తులకే మద్యం విక్రయించాలని లేకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే మంచిర్యాల జిల్లాలో మాస్క్ లు లేకుండా తిరుగుతున్నవారికి శ్రీరాంపూర్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. చెన్నూర్ నియొజకవర్గ కేంద్రంలో ఉదయం మార్కెట్ లో మాస్క్ ధరించకుండా కూరగాయలు అమ్ముతున్నందుకు మున్సిపల్ అధికారులు రూ. 500 ఫైన్ వేశారు. ఇదిలా ఉంటే, కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామం మాత్రం మద్యానికి దూరంగా ఉంటూ…అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
కరీంనగర్ జిల్లాలోని కాట్రపల్లి గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తమ గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. లాక్డౌన్ సడలింపులతో మద్యం షాపులు తిరిగి తెరుచుకున్నాయి. కానీ, కాట్రపల్లి పంచాయతీలో మాత్రం మద్యం అమ్మకాలు నిషేధించారు. పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానాతో పాటు సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. వీటితో పాటు నల్లా కనెక్షన్ కూడా తొలగిస్తామని తెలిపారు. దీంతో గ్రామ పెద్దల నిర్ణయాన్ని ఊరంతా మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.