13 ప్యాకేజీలతో 39 సరస్సుల సుందరీకరణ: జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సరస్సుల సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 36 సరస్సులలో..9 ప్యాకేజీలలో 3ఏళ్ల పాటు కొనసాగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనులు చేపట్టేందుకు..
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సరస్సుల సుందరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 36 సరస్సులలో 31 కోట్ల రూపాయల వ్యయంతో సరస్సులలోని గుర్రపుడెక్క తొలగింపు, సుందరీకరణ పనులు చేపట్టడానికి జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. ఈ పనులు 9 ప్యాకేజీలలో 3ఏళ్ల పాటు కొనసాగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం సమావేశమైన మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
ఒప్పందం ప్రకారం ఆయా ఏజెన్సీలు గుర్రపుడెక్కను తొలగించి సరస్సులను శుభ్రంచేయాలి. వ్యర్థాలను జవహర్ నగర్లో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించాలి. శుభ్రం చేయడం, రవాణా కార్యకలాపాలను ఏజెన్సీలకే అప్పగిస్తూ స్టాండింగ్ కమిటీ ప్రతిపాధించింది. అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ..నగరంలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్వహణ, 3వేల మరుగుదొడ్ల నిర్మాణం, బస్ షెల్టర్లు, ఫుట్పాత్ల అభివృద్ది, స్టేడియంల నిర్వహణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర పనుల ప్రగతిని జోన్ల వారీగా సమీక్షించారు.
నగరంలో 347 కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టగా వాటిలో 90 బస్ షెల్టర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 3 వేల మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్లు వెడల్పుగా ఉన్నచోట కొత్త బస్-బేలను ఏర్పాటు చేయాలన్నారు. సర్కిళ్లవారీగా కార్పొరేటర్లు, ఈఈలతో పనుల ప్రగతిని చర్చించడంతో పాటు అత్యవసర పనులను చేపట్టేందుకు గుర్తించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. నగరంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మోడల్ గ్రేవ్ యార్డ్లను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు కమిషనర్లు రాహుల్ రాజ్, యాదగిరిరావు, సీసీపీ దేవేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.