Telangana: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు.. రిజర్వేషన్ల ఇష్యూపై ఏమన్నారంటే…
రిజర్వేషన్లపై రాజకీయ రణం పీక్స్కు చేరుతోంది. అమిత్ షా, రాహుల్ గాంధీ ఎంట్రీతో తెలంగాణ పాలిటిక్స్లో రిజర్వేషన్ల అంశం హైలెట్గా మారింది. ఎవరికి వారు ఈ అంశంపై తమ పార్టీ స్టాండ్ ఏంటో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. నిన్న మొన్నటివరకు స్థానిక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగగా.. ఇప్పుడు జాతీయ నేతలు రంగంలోకి దిగడంతో పొలిటికల్ వార్ మరో రేంజ్కు చేరుకుంది. తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రిజర్వేషన్ల విషయంలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
నిర్మల్, అలంపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు ఎత్తేయడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పెంచుతామన్నారు. అన్ని రంగాలను మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారని.. ప్రైవేటీకరణ అంటేనే రిజర్వేషన్లను తొలగించడమేనన్నారు రాహుల్. “ప్రధాని మోదీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఆయన రిజర్వేషన్లు రద్దకు ప్రయత్నిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం ఉన్న పరిమితిని మేం అధికారంలోకి రాగానే తొలగిస్తాం. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలోనూ పెట్టాం” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు
రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లబోదని స్పష్టం చేశారు. అయితే ముస్లిం రిజర్వేషన్లకు మాత్రం తాము వ్యతిరేకమని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు తీసి దళితులకు ఇస్తామన్నారు అమిత్ షా. “మేం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రచారం చేస్తున్నారు. నేను ఈ విషయంలో స్పష్టత ఇస్తున్నాను. పార్లమెంట్లో బీజేపీ ఉన్నంతవరకు దళిత, గిరిజన, ఓబీసీ రిజర్వేషన్లు తొలగించనివ్వం” అని అమిత్ షా పేర్కొన్నారు
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారంలో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఇరు పార్టీల నేతలు ఇదే అంశంలో ఒకరినొకరు టార్గెట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…