తెలంగాణలో కరోనా తగ్గుముఖం..
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య..
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది. ఇందులో 430 యాక్టివ్ కేసులు కాగా 45 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఇంటికి చేరారు. ఇక కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కొల్పోయారు.
ఇక హైదరాబాద్లో అత్యధికంగా 179 కేసులు నమోదు కాగా, నిజామాబాద్లో 49 పాజిటివ్ కేసులు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 23 కేసులు, మెడ్చల్ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడిచేయడానికి ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆరు ల్యాబ్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. ఎన్ని పాజిటివ్ కేసులు నమోదైనా చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
అలాగే వైద్యసిబ్బందికి అవసరమైన ఎన్-95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, హ్యాండ్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లను సిద్ధం చేస్తోంది. మరోవైపు.. నగరంలో రైల్వే ఆధ్యర్యంలో తొలి కోవిడ్ ఆసుపత్రి కూడా అందుబాటులోకి వచ్చింది. లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక పడకలు, ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సిబ్బంది నియామకానికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నెల 15న వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను కూడా పోలీసులు మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.