కరోనాపై పోరులో తెలంగాణ నెం.1…అందుబాటులో మరిన్ని
రాష్ట్రంలో కోరలు చాస్తోన్న వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనాపై చేస్తున్న యుద్ధంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలుస్తోంది....
దేశంలో కరోనా వైరస్ మహ్మమారి మరింత తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు అంతేస్థాయిలో ఉన్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్ కొనసాగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణలో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం కలకలం రేపింది. రాష్ట్రంలో కోరలు చాస్తోన్న వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనాపై చేస్తున్న యుద్ధంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలుస్తోంది.
తెలంగాణ రెడీః కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేస్తోంది. వేగంగా విస్తరిస్తోన్న వైరస్ కేసుల సంఖ్య దాదాపు 350కి చేరువులో ఉంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖను మరింత అప్రమత్తం చేశారు. వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. ఢిల్లీ ప్రార్థనల అంశం అనంతరం పెరుగుతున్న కేసుల దృష్ట్యా కరోనా బాధితులకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తున్నారు.
అందుబాటులో అత్యవసర పీపీఈ కిట్లుః ఒకేసారి లక్షమంది పేషంట్లకు కూడా వైద్యం అందించగల సదుపాయాలను సమకూరుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బాధితులకు కావాల్సిన మందులు, వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, పేషంట్లు, డాక్టర్లు, సిబ్బందికి అవసరమైన ప్రత్యేక దస్తులను పెద్ద మొత్తంలో సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 12కోట్ల విలువ గల పీపీఈ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రూ. 20 కోట్లు వెచ్చించి ఫ్లూయిడ్స్ని కోనుగోలు చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కిట్లు వైద్యశాఖ అత్యంత అవసరం. మరో, లక్ష పీపీఈ కిట్ల ఉత్పత్తిని స్థానికంగానే తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసింది.కేవలం రెండున్నర గంటల్లోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగల 500 కరోనా టెస్టింగ్ కిట్లను కోనుగోలు చేసింది. ఒక్క కిట్ సాయంతో 100మందికి టెస్ట్ చేయటానికి ఉపయోగపడుతుంది. 500 కిట్లతో మొత్తం 50వేల మందికి కరోనా టెస్ట్లు చేయగలుగుతాము.
వెంటిలేటర్ల అవశ్యకతః కరోనా వైరస్ చికిత్సకు వెంటిలేటర్లు అత్యంత అవసరం. ఈ మేరకు ప్రభుత్వం 500 వెంటిలేటర్లకు ఆర్డర్ చేసింది. డీఆర్డీ అనుసంధానంతో మరో 500వెంటిలేటర్లు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వెంటిలేటర్ల కోసం అనుమతి కోరింది. మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వెయ్యి వెంటిలేటర్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయా శాఖలతో చర్చలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 2200 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరోనా వైద్య చికిత్సలో ఉపయోగించే ప్రధాన డ్రగ్స్ని కూడా ప్రభుత్వం పెద్దమొత్తంలో కోనుగోలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా లాక్డౌన్ని పటిష్టంగా అమలు చేస్తోంది.