చైనా నియంతృత్వ చర్యలు… కరోనా వైరస్‌పై వార్తలందించినందుకు జైలు శిక్ష… సిటిజన్ జర్నలిస్టులకు తిప్పలు…

| Edited By:

Dec 19, 2020 | 3:32 PM

కరోనా వైరస్ మహమ్మారి గతేడాది డిసెంబరు నెలలో చైనాలో తొలిసారిగా వెలుగు చూసింది. అయితే ఈ మహమ్మారి గురించి ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్ట్‌కు చైనా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

చైనా నియంతృత్వ చర్యలు... కరోనా వైరస్‌పై వార్తలందించినందుకు జైలు శిక్ష... సిటిజన్ జర్నలిస్టులకు తిప్పలు...
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి గతేడాది డిసెంబరు నెలలో చైనాలో తొలిసారిగా వెలుగు చూసింది. అయితే ఈ మహమ్మారి గురించి ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్ట్‌కు చైనా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ న్యాయవాది, పౌర పాత్రికేయురాలు ఝాంగ్‌ ఝాన్ (37) ఈ ఏడాది ఫిబ్రవరిలో షాంఘై నుంచి వుహాన్ వెళ్లి వైరస్‌కు సంబంధించి పలు కథనాలను వెలువరించారు. కరోనా వైరస్‌ గురించి ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు హింసించారని, కొందరు స్వతంత్ర జర్నలిస్ట్‌లు కనిపించకుండా పోయారంటూ తన కథనాల్లో పేర్కొన్నారు.

 

జైలులో నిరాహార దీక్ష…

ఈ మేరకు చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ (సీహెచ్ఆర్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. గొడవలకు దిగుతూ సమస్యలను సృష్టిస్తోన్నారనే ఆరోపణలతో మే 14 ఝాన్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని సీహెచ్ఆర్డీ వెల్లడించింది. అనంతరం వుహాన్ నుంచి ఆమెను షాంఘైకి తరలించారు. జూన్ 19న ఝాంగ్‌ను అధికారికంగా అరెస్ట్ చేశారు. మూడు నెలల తర్వాత సెప్టెంబరు 9న న్యాయవాదిని కలిసేందుకు ఆమెకు అనుమతి లభించింది.తన అరెస్టుకు నిరసనగా సెప్టెంబరు 2 నుంచి ఝాన్ జైలులో నిరాహార దీక్ష చేపట్టారని, ఆమెకు అధికారులు బలవంతంగా ఆహారం తినిపించారని లాయర్ ద్వారా తెలిసినట్టు పేర్కొంది. సెప్టెంబరు 28న మరోసారి లాయర్ కలుసుకోగా.. ఆ సమయంలో ఆమె చాలా నీరసంగా ఉన్నట్టు గుర్తించారని సీహెచ్‌ఆర్డీ వివరించింది. సెప్టెంబరు 18న న్యాయస్థానం దోషిగా నిర్ధారించినట్టు ఆమె తరపు న్యాయవాదికి ఫోన్ వచ్చింది.

 

కనిపించకుండపోయిన చాలా మంది జర్నలిస్టులు…

వీచాట్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో కోవిడ్‌-19పై తప్పుడు ప్రచారం చేసినట్టు రుజువు కావడంతో ఆమెకు శిక్ష విధించినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది. కాగా, వుహాన్‌లో ఝాన్‌లాంటి ఎంతోమంది జర్నలిస్టులు కనిపించకుండా పోయారు. వారిలో కొందరు ఆ తర్వాత కనిపించినా, చాలామంది జాడ ఇప్పటికీ తెలియరాలేదు. ఝాంగ్ ఝాన్‌తోపాటు చెన్ మెయి, కాయ్ వుయ్ అనే మరో ఇద్దరు పౌర పౌత్రికేయులను కూడా కరోనా వైరస్ న్యూస్ విషయంలో అరెస్ట్ చేశారు. ఇక, ఫిబ్రవరిలో కనిపించకుండా పోయిన లీ జహౌ అనే జర్నలిస్ట్‌‌ ఆచూకీ కొద్ది రోజుల లభించింది. తనను భద్రతా బలగాలు రెండు వారాల పాటు బలవంతంగా క్వారంటైన్‌లో ఉంచాయని ఆమె ఆరోపించారు.