ఉగ్ర ఒడిలో శ్రీలంక

| Edited By:

Apr 22, 2019 | 9:21 PM

అతి చిన్న ప్రదేశమైన శ్రీలంక భయానక ఉగ్రదాడి పాలబడి రక్తాశ్రువులు చిందిస్తున్న వేళ ఇది. క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్‌ నాడు మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లతో సహా ఎనిమిదిచోట్ల ఉగ్రమూకలు సృష్టించిన ఘోరకలి మూడు వందల మందికి పైగా అభాగ్యుల ప్రాణాల్ని బలిగొని, మరెన్నో వందలమందిని క్షతగాత్రుల్ని చేసేసింది. ఈ ఉగ్ర ఘటన శ్రీలంకనే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ దిగ్భ్రాంతపరచింది. ఆదివారం ఉదయమే రాజధాని కొలంబో నగరంలోని విఖ్యాత సెయింట్‌ ఆంటొనీ చర్చితోపాటు ప్రధానమంత్రి అధికారిక […]

ఉగ్ర ఒడిలో శ్రీలంక
Follow us on

అతి చిన్న ప్రదేశమైన శ్రీలంక భయానక ఉగ్రదాడి పాలబడి రక్తాశ్రువులు చిందిస్తున్న వేళ ఇది. క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్‌ నాడు మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లతో సహా ఎనిమిదిచోట్ల ఉగ్రమూకలు సృష్టించిన ఘోరకలి మూడు వందల మందికి పైగా అభాగ్యుల ప్రాణాల్ని బలిగొని, మరెన్నో వందలమందిని క్షతగాత్రుల్ని చేసేసింది. ఈ ఉగ్ర ఘటన శ్రీలంకనే కాదు ప్రపంచ దేశాలన్నింటినీ దిగ్భ్రాంతపరచింది. ఆదివారం ఉదయమే రాజధాని కొలంబో నగరంలోని విఖ్యాత సెయింట్‌ ఆంటొనీ చర్చితోపాటు ప్రధానమంత్రి అధికారిక నివాసానికి సమీపంలోని సిన్నమోన్‌ గ్రాండ్‌ హోటల్‌, షాంగ్రిలా, కింగ్స్‌బరీ హోటళ్లు ఆత్మాహుతి దాడులతో నెత్తురోడాయి. కొలంబోకు ఉత్తర ప్రాంత పట్టణమైన నెగొంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, బట్టికలోవాలోని జియోన్‌ చర్చిపై భీకర మృత్యుదాడికి పదుల సంఖ్యలో అమాయకుల బలయ్యారు. సాయంత్రం వేళ మరో రెండుచోట్ల పెను విస్ఫోటాలు ఉగ్ర కుట్ర ఎంత కట్టుదిట్టంగా అమలైందీ కళ్లకు కట్టాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించి, సామాజిక మాధ్యమాల్ని నిషేధించి ఉగ్రమూకల కదలికల్ని కనిపెట్టడానికి శ్రీలంక ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కదిలింది. దాదాపు నలభైమంది దాకా విదేశీయులూ ఈ కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో అంతర్జాతీయ సమాజం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ప్రసిద్ధ చర్చిలపై ఆత్మాహుతి దాడుల ప్రమాదం పొంచి ఉందని పది రోజుల క్రితమే శ్రీలంక పోలీస్‌ బలగాల అధిపతి ముందస్తుగా హెచ్చరించారు. నేషనల్‌ తౌవీత్‌ జమాత్‌ (ఎన్‌టీజే) అనే సంస్థ కొలంబోలోని భారత హైకమిషన్‌‌తో సహా ప్రార్థనా స్థలాలపై విరుచుకు పడనున్నట్లు హెచ్చరించినా తదనుగుణంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చెయ్యలేక పోయింది శ్రీలంక ప్రభుత్వం.

అయిదు వారాల క్రితం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ మసీదుపై దాడికి తెగబడిన ఉగ్రవాది అభాగ్యుల ఆక్రందనల్ని పదిహేడు నిమిషాలపాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన వైనం నిశ్చేష్టపరచింది. ఈస్టర్‌ పర్వదిన సందర్భంగా ఉగ్రశక్తులు చెలరేగి 2016లో లాహోర్‌లో 75మందిని, 2017లో ఈజిప్టులో 45మందినీ బలిగొన్న విషాదానికి ఈసారి శ్రీలంక కొనసాగింపుగా మారింది. తమ దేశానికి చెందిన 32 మంది ముస్లిములు దేశం విడిచిపెట్టి ఉగ్రసంస్థ ఐసిస్‌లో చేరారని శ్రీలంక ప్రభుత్వం 2016లో ప్రకటించింది. బోడు బలసేన (బీబీఎస్‌) లాంటి ఛాందసవాద బౌద్ధ వర్గాలు వర్గ విద్వేషాల్ని పెంచుతున్నాయని, ముస్లిముల నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతున్నట్లు భావిస్తున్నాయని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముస్లిములపై బౌద్ధుల దాడుల నేపథ్యంలో నిరుడు మార్చిలో ప్రభుత్వం కాండీ నగరంలో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. కొత్తగా ఏర్పాటైన ఎన్‌టీజే బృందానికి చెందిన నలుగుర్ని నిర్బంధించిన పోలీసు యంత్రాంగం మొన్న జనవరిలో భారీ విస్ఫోటన సామగ్రిని స్వాధీనం చేసుకొంది.

ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తే కూలేవి భవంతులే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థల పునాదులూ కదిలిపోతాయంటూ అమెరికా అధ్యక్షుడిగా జార్జి బుష్‌ చెప్పింది అక్షరసత్యం. ఇరాక్‌ యుద్ధం సరికొత్త జిహాదీల పుట్టుకకు కారణభూతమై ఇతర దేశాల్లో చిచ్చు రగిలించే ప్రమాదం ఉందన్న అమెరికా నిఘా సంస్థ సీఐఏ అంచనా నిజమైంది. ఈ కష్టకాలంలో కొలంబోకు భారతావని చేదోడువాదోడుగా ఉండటం అందరికీ శ్రేయస్కరం.