Pawan Kalyan: జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా ఏపీకి ముఖ్యమంత్రి చేయాలంటూ కొందరు జనసేన నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ పవన్ అభిమానులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు.

Pawan Kalyan: జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
Pawan Kalyan

Updated on: Jan 26, 2025 | 11:25 PM

జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి జనసేన వారు ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని పవన్ కోరారు.

ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసరం ఉందన్న పవన్.. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని స్పష్టంచేశారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం, తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి జెన్నత్యాన్ని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టిడిపి, బిజేపి (NDA) కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు..గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టిందుకు అనుభవం కలిగిన పాలన, బావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 154/175 స్థానాలను NDA కూటమికి ఇచ్చారని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేసుకున్నారు.

ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికారం చేపట్టిన రోజు నుండి  ప్రధాని నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాదించే దిశగా చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నా సరే దానంతటికి కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృడ సంకల్పమే కారణమన్నారు.

పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ


ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆంధ్ర సాదించి వికసిత్ భారత్ సాదనలో 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో మార్చ్ 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కాన్నారు.