Nellore District: ఇతడిని తిట్టాలా.. జాలి పడాలా..? మూఢనమ్మకాలతో కన్నబిడ్డనే చంపేశాడు
మూఢనమ్మకాలతో 3 ఏళ్ల కూతురిని చంపేశాడు ఓ తండ్రి. నోట్లో కుంకుమ కుక్కి మరీ పాశవికంగా చిన్నారిని చిదిమేశాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
AP News: తండ్రి మూర్ఖత్వం చిన్నారి ప్రాణాలు తీసింది. తన కుటుంబానికి ఏదో చెడు చుట్టుకుందని… అది పోవాలంటే పూజలు చేయాలనుకున్న తండ్రి.. తన కన్నకూతురి ప్రాణాలు తీశాడు. ఒంటిపై పసుపు నీళ్లు పోసి, నోటి నిండా కుంకుమ కుక్కడంతో ఊపిరాడకుండా చేశాడు. దీంతో బాలిక ప్రాణపాయస్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స అందించే లోపు చనిపోయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు(Atmakur) పేరారెడ్డిపల్లి(Perareddy Palli)కి చెందిన వేణుగోపాల్ వ్యాపారంలో నష్టపోయాడు. కుటుంబానికి కీడు జరగకుండా ఉండాలంటే..పూజలు చేయాలని దొంగ బాబా ఇచ్చిన సలహాతో ఇంతటి దారుణానికి తెగబడ్డాడు తండ్రి. ఇంట్లో దేవుని పటాల ముందు మూడేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెట్టాడు. బుధవారం తన కవల కుమార్తెల్లో ఒకరైన పునర్వికను పూజ గదిలో పడుకోబెట్టి…భార్యతో పసుపు నీళ్లు పోయించాడు. ఆతర్వాత నోట్లో కుంకుమ పోయడంతో ఊపిరాడక బాలిక కేకలు వేసింది. వెంటనే చుట్టు పక్కల వారు వచ్చి ఆమెను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. కండీషన్ సీరియస్గా మారడంతో నెల్లూరు ఆసుపత్రికి అక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
తాను దేవుడినంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వేణుగోపాల్ను బంధువులు బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజంగా అతడిని తిట్టాలో, మూఢనమ్మకాలతో బిడ్డనే చంపేసిన అతని అజ్ఞానానికి జాలి పడాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది జనవరి నెలలో మదనపల్లెలో క్షుద్రపూజల పేరుతో ఇద్దరు బిడ్డల్ని చంపేసిన తల్లిదండ్రుల ఉదంతం మరవకముందే తాజా ఘటన మరోసారి సమాజంలోని మూఢత్వాన్ని ప్రశ్నిస్తుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..