Andhra Pradesh: ఫుడ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి ఆచూకీ గల్లంతు.. ఇద్దరి పరిస్థితి విషమం..
ఫుడ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు కార్మికులు. ఇంతకీ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి ? ఎంతమంది గల్లంతయ్యారు?
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పెంటపాడు సమీపంలోని ఫుడ్ ప్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫుడ్ ఫాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం కారణంగా ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి భయాందోళనలతో ఫ్యాక్టరీ కార్మికులు బయటకు పరుగులు తీసారు. ఆయిల్లో మిక్స్చేసే కెమికల్ సాల్వెంట్ అయిల్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా బాయిలర్ పేలుడు సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడిన సమయంలో అక్కడ ఉన్న ఎనిమిది మంది కార్మికుల్లో జగన్నాథపురానికి చెందిన మల్లి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహూటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మంత్రి కరుమురి నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధానాలుగా ఆదుకుంటుమని హామీ ఇచ్చారు.
ఫ్యాక్టరీ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకోగా వారిలో ముగ్గురు కార్మికులు ఎం.రమేష్, జి.బాబ్జీ, షేకా మీరా క్షేమంగా బయటపడ్డారు. ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన టి.దుర్గాప్రసాద్, కె.చరణ్ ను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కోనా నాగబాబు, ముప్పిడి రామకృష్ణ, సునీల్కుమార్ స్వల్పగాయాలతో తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కుంచనపల్లికి చెందిన మల్లికార్జున్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని కోసం ప్లాంట్లో రెస్క్యూ టీం, పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..