కెరటాలతో పోరాడుతూ ఆ 30 గంటలు నడిసంద్రంలోనే..! అసలు ఏమైంది..

వాళ్లంతా గంగను నమ్ముకున్న గంగ పుత్రులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. రోజు మాదిరిగానే ఆ తల్లికి మొక్కుకొని వేటకు బయలుదేరిన వారికి.. అనుకోని రాకాసి అల వారు ప్రయాణిస్తున్న తెప్పను తిరగేసింది. అంతే..! నడిసముద్రం చిమ్మ చీకటి.. అరచేతిలో ప్రాణం పెట్టుకుని ఈదారు.

కెరటాలతో పోరాడుతూ ఆ 30 గంటలు నడిసంద్రంలోనే..! అసలు ఏమైంది..
Vizag Fishermen
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 03, 2024 | 3:30 PM

వాళ్లంతా గంగను నమ్ముకున్న గంగ పుత్రులు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. రోజు మాదిరిగానే ఆ తల్లికి మొక్కుకొని వేటకు బయలుదేరిన వారికి.. అనుకోని రాకాసి అల వారు ప్రయాణిస్తున్న తెప్పను తిరగేసింది. అంతే..! నడిసముద్రం చిమ్మ చీకటి.. అరచేతిలో ప్రాణం పెట్టుకుని ఈదారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 గంటలకుపైగా నడి సంద్రంలోని కెరటాలతో పోరాడి తిండి తిప్పలు లేకుండా గడిపారు. అతి కష్టం మీద బయటకు వచ్చారు.

సోమవారం సాయంత్రం ఐఎస్డి ఏపీ ఎంక్యూ 2736 బొట్లో ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు బయలుదేరారు ఆరుగురు మత్స్యకారులు. చిన్నారావు, నరేంద్ర, మహేష్, అప్పన్న, చిన సత్తెయ్య, పొడుగు అప్పన్న కలిసి గంగవరం వైపు వెళ్లారు. వేటకు వెళ్లిన ఆరుగురు తిరిగి రాలేదు. సోమవారం రాత్రి 10 గంటలకు ఫోన్లో మాట్లాడిన మత్స్యకారులు.. ఆ తరువాత ఆచూకీ లేకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. మంగళవారం తిరిగి చేరుకోవాల్సి ఉన్నా.. రాలేదు. కుటుంబ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాడంతో కోస్ట్ గార్డ్ అప్రమత్తమైంది. హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన మరింత పెరిగింది. అయితే.. ఎట్టకేలకు గతరాత్రి మత్స్యకారులు సేఫ్గా అప్పికొండ ఒడ్డుకు చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు, కుటుంబ సభ్యులు. వాతావరణం అనుకూలించక సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

మరి వాళ్లంతా ఇన్ని గంటల పాటు ఎక్కడున్నారు..?

నడిసంద్రంలో బోటు బోల్తా పడితే.. ఒడ్డుకు ఎలా రాగలిగారు..? ఆ 30 గంటలు ఎలా గడిపారు..? అసలేం జరిగిందంటే.. సోమవారం మధ్యాహ్నం ఆరుగురు తో కూడిన మోటార్ బోటు వేటకు బయలుదేరింది. గంగవరం వైపు సముద్రం మధ్యలో వేట సాగిస్తున్నారు. చీకటి పడింది.. రాత్రి అయింది. ఒక్కసారిగా భారీ గాలి.. కెరటం ఎగసపడి బోటుని అమాంతంగా తిరగేసింది. దీంతో బోర్డుపై ఉన్న ఈ ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. బోటులో ఉన్న సామాగ్రి అంతా మునిగిపోయిందని అంటున్నాడు బాధితుడు వాసుపల్లి అప్పన్న.

ఇవి కూడా చదవండి

దారి చూపిన ఫ్లెక్సీ..

సెల్ ఫోన్లు నీటిలో పడిపోయాయి. దీంతో ప్రాణాలు అరచేత పట్టుకొని సముద్రంలో ఈదారు. భారీ అలలో గాలి తీవ్రతకు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయినా ధైర్యం కోల్పోకుండా.. ఒకరికొకరు సహకరించుకున్నారు. బోటు ఫైబర్ ది కావడంతో నీటిపై తేలేడుతూ ఉంది. ఈ ఆరుగురు మత్స్యకారులో ఒకరు నీటిలోకి వెళ్లి.. తిరగబడిన బోటులోని ఓ ఫ్లెక్సీ లాంటి కవర్ను పైకి తీసుకొచ్చారు. ఆఫ్ ఫ్లెక్సీ‎ని పట్టుకొని తిరగబడిన బోటు పైకి ఎక్కారు. విండ్ డైరెక్షన్ ఆధారంగా అటూ ఇటూ కదిలారు. గంటలు గడుస్తున్నాయి.. ఒడ్డు కనిపించడం లేదు. గాలి తీవ్రతకు ఇంకా లోపలి వైపు వెళ్ళిపోతుంది బోటు. దీంతో ఆందోళన మరింత ఎక్కువైంది. రాత్రంతా సముద్రంలోనే గడిపారు. తెల్లారింది.. అయినా ఒడ్డుకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. గంటలు గడుస్తున్నాయి.. ఆకలి దాహం.. ఎండ కూడా మొదలైంది. దీంతో నడిసముద్రంలో బిక్కు బిక్కు మంటూ గడిపారు ఆ ఆరుగురు మత్స్యకారులు. చివరకు అదృష్టం కొద్ది విండ్ డైరెక్షన్ మారింది. దీంతో తిరగబడిన తెప్ప పై ఫ్లెక్సీని వెండి డైరెక్షన్ ఆధారంగా చేత పట్టుకొని.. మెల్లగా ఓడ్డు వైపు వచ్చారు. దాదాపు 30 గంటల తర్వాత.. అప్పికొండ తీరానికి చేరారు. బోటు తిరగబడిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి.. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్తామన్న ఆశలు కూడా వదులుకున్న పరిస్థితి వచ్చిందని అంటున్నారు ఆ బాధిత మత్స్యకారుల్లో ఒకరు చిన్నారావు.

ఘటన తలచుకుంటూ ఇంకా షాక్‎లోనే..

మత్స్యకారులు గల్లంతైన సమాచారంతో అనుక్షణం పర్యవేక్షించారు ఏపీ మేకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసపల్లి జానకిరామ్. అధికారులను అలర్ట్ చేశారు. అయితే.. తీరానికి సేఫ్‎గా చేరినప్పటికీ ఇంకా షాక్‎లోనే ఉన్నారు ఆ మత్స్యకారులు. వలలు నీటిలో కొట్టుకుపోయాయి, సామాగ్రి పనిముట్లు కూడా సముద్రంలో పడిపోయాయి. వేట జీవనాధారమైన బోటు కూడా ముక్కలైంది. దీంతో ఇక తమ భృతి ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. బాధితులను ఎమ్మెల్యే గణేష్ కుమార్ పరామర్శించారు. నష్టపరిహారంతో పాటు అన్ని విధాల మత్స్యకారులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఆ గంగమ్మ తల్లి దయతోనే..

30 గంటల పాటు నడి సంద్రంలో కెరటాలతో సహవాసం చేసి.. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఎట్టకేలకు ఒడ్డుకు చేరిన ఈ మత్స్య కారులు మృత్యుంజయలుగా చెబుతున్నారు స్థానికులు. తాము నమ్ముకున్న ఆ గంగమ్మ తల్లే తమ ప్రాణాలు కాపాడిందని అంటున్నారు ఆ మత్స్యకారులు. సేఫ్గా అంతా చేరుకున్నందుకు ఆ గంగమ్మ తల్లికి మొక్కుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..