ఆన్లైన్లో క్లాసెస్ చూడాలనే ఓ బాలుడి కోరిక ఆత్మహత్యకు దారి తీసింది. మొబైల్ ఫోన్ లేదనే బాధతో బాలుడు(15) ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..విజయవాడ సిటీలోని విద్యాధరపురం ఏరియాకు చెందిన ఓ బాలుడి తల్లి పువ్వులు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. బాలుడి వయసు 11 నెలలప్పుడు తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లే కుమారుడ్ని అనేక కష్టనష్టాలకోర్చి పెంచుతోంది. వచ్చే కొద్ది సంపాదనతోనే అతడిని చదివిస్తోంది. ప్రస్తుతం బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కోవిడ్ లాక్ డౌన్ వల్ల స్కూల్స్ మూసి ఉన్న సంగతి తెలిసిందే. సప్తగిరి ఛానల్ లో వస్తున్న ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాడు. స్మార్ట్ ఫోన్ ఉంటే.. యూట్యూబ్ లో తరగతులు వినేవాడినంటూ తల్లితో చెబుతూ బాధపడుతూ ఉండేవాడు. దీంతో తల్లి.. తమ వద్ద అంత డబ్బు లేదని, స్కూల్స్ తెరిస్తే పాఠాలు చెబుతారని, ఫోన్ అవసరం ఉండదంటూ నచ్చజెబుతూ వస్తోంది.
బుధవారం మధ్యాహ్నం కుమారుడు స్నానం చేసి రమ్మని చెప్పింది. స్నానానికి బాత్ రూమ్ లోకి వెళ్లిన బాలుడు, ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో వెళ్లి చూసింది. ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. షాక్ కు గురైన తల్లి.. ఆటోలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వారు చేర్చుకోకపోవడంతో గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. డాక్టర్లు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆసుపత్రి నుంచి భవానీపురం పోలీసులకు వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్