ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం.. ఎందుకో తెలుసా

Updated on: Jun 30, 2025 | 7:25 PM

ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. దీనిని సమరసతకు, ఐక్యతకు, భక్తికి చిహ్నంగానూ భక్తులు భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా, జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలు తమ తమ రథాలపై నగర పర్యటనకు వెళతారు. ఈ క్రమంలో ఆ రథాలు గుడి నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్నాథుడి ముస్లిం భక్తుడు సాలబేగ సమాధి వద్ద.. కాసేపు ఆగి, ఆ తర్వాతే ముందుకు కదులుతాయి.

దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉందని చెబుతారు. సాలబేగ అనే మొఘల్ సుబేదార్ కుమారుడు పూరీ జగన్నాథుడి మహిమలు విని, స్వామిని దర్శించుకోవాలని మందిరానికి వెళతాడు. అయితే, హైందవేతరులకు ఆలయ ప్రవేశం లేదంటూ అధికారులు ఆయనను లోపలికి వెళ్లనీయకపోవటంతో నిరాశపడతాడు. నాటి నుంచి స్వామి మీద ఆసక్తి.. భక్తిగా మారి నిరంతరం జగన్నాథుని పూజిస్తూ భజనలు, కీర్తనలు పాడటం మొదలుపెడతాడు. ఒక ఏడాది రథయాత్ర సమయానికి సాలబేగ జబ్బుపడతాడు. లేవలేక పోతాడు. ఇంటి ముందు నుంచి స్వామి రథం వెళుతున్నా చూడలేకపోయానే అని తెగ భాధపడిపోతాడు. అయితే, సరిగ్గా ఆ సమయానికి బిగ్గరగా భక్తుల నామస్మరణ వినిపిస్తుంది. అంతేకాదు.. ఆ మూడు దివ్య రథాలు సరిగ్గా ఆ ప్రధాన వీధిలోని ఆయన ఇంటి ముందు ఆగిపోతాయి. వేలాది భక్తులు ఆ రథాల తాళ్లను ఎంత లాగినా, అవి అంగుళం కూడా ముందుకు కదలకపోవటంతో జనం ఆశ్చర్య పడిపోతారు. అలా 7 రోజులు సాలబేగ ఇంటి ముందే ఆ రథాలు ఆగిపోయాయి. దీంతో ఆ వారం పాటు స్వామి ఉపచారాలన్నీ రథంలోనే చేశారట. ఈ లోగా ఒక రాత్రి ఆలయ ప్రధాన పూజారి కలలో కనిపించిన జగన్నాథుడు.. తన భక్తుడు సాలబేగ అనారోగ్యంగా ఉన్నందునే.. అతడు కోలుకుని వచ్చేవరకు తాను అక్కడే ఉంటానని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత సాలబేగ కోలుకుని, ఇంటి నుంచి రథాల వద్దకు వచ్చి.. స్వామిని దర్శించుకుని, హారతి ఇవ్వగానే రథాలు ముందుకు కదిలాయట. దీంతో, సాలబేగ అపర భక్తికి గుర్తుగా, నాటి నుంచి నేటి వరకు ఆ మార్గంలో ఉన్న సాలబేగ సమాధి వద్ద కొన్ని నిమిషాల పాటు రథాలను నిలుపటం ఆచారంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు