సామాన్య పాస్టర్‌ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

Updated on: Apr 19, 2026 | 11:41 AM

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఓ పాస్టర్ ఇంట్లో పోలీసులు రూ. 2.27 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి అల్లుడు శ్యామ్సన్ 50 లక్షలు తెచ్చిన సమాచారంతో దాడులు చేయగా, బీరువాల్లో గుట్టలకొద్దీ కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో హవాలా కోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నగదుకు సరైన లెక్కలు చూపకపోవడంతో ఐటీ శాఖకు అప్పగించనున్నారు.

అది పైకి మాత్రం ఒక సామాన్య దైవభక్తుడైన పాస్టర్ ఇల్లు.. లోపలికి వెళ్తే తెలిసింది అసలు విషయం. అక్కడి విషయం తెలుసుకున్న ఎవరో పోలీసులకు ఉప్పందించారు. పక్కా ప్లాన్‌తో అక్కడ వాలిపోయారు పోలీసులు. పాస్టర్‌ ఇంట్లో సోదాలు చేసిన పోలీసుల కళ్లు చెదిరిపోయాయి. బీరువాల్లో గుట్టలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూసి అధికారులు విస్తుపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వెలుగుచూసిన ఈ భారీ నగదు నిల్వల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి నర్సాపురానికి అక్రమంగా భారీ ఎత్తున నగదు తరలుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. నర్సాపురం పీచుపాలెంలో నివాసం ఉంటున్న పాస్టర్ ఘంటా జాన్ బాబూరావు అల్లుడు శాంసన్, హైదరాబాద్ నుండి సుమారు రూ. 50 లక్షల నగదుతో ఇంటికి చేరుకోగానే పోలీసులు మెరుపు దాడి చేశారు. ఓస్‌.. రూ.50 లక్షలకే ఇంత బిల్డప్పా అనుకుంటే పొరపాటే.. ఇంటి లోపల సోదాలు చేసిన పోలీసులకు కట్టల కొద్దీ నోట్ల గుట్టలు కనిపించాయి. బాబూరావు అల్లుడు తాజాగా తెచ్చిన రూ.50 లక్షలతో కలిపి మొత్తం రూ. 2,27,94,000 లిక్విడ్ క్యాష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో వీరికి నగదు ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్ లో వీరి వ్యాపారం ఏమిటి ? అంత మొత్తంలో నగదును బ్యాంకుల ద్వారా కాకుండా నేరుగా ఎందుకు తరలించారు? అన్నదానిపై పోలీసులు ఆరా తీయగా పాస్టర్ కుటుంబ సభ్యులు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఈ వ్యవహారంలో ‘హవాలా’ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోసం లేదా ఇతర అక్రమ లావాదేవీల కోసమే ఈ డబ్బును తరలించారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ ఘటనపై నర్సాపురం రూరల్ సిఐ దుర్గ ప్రసాద్ చెప్పింది ఏంటంటే.. పాస్టర్ జాన్ బాబూరావు, ఆయన అల్లుడు శాంసన్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి సరైన లెక్కలు చూపకపోవడంతో, ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను (IT) శాఖకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. ఒక సామాన్య పాస్టర్ ఇంట్లో కోట్ల రూపాయలు దొరకడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srikalahasti: పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ

Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. ఆసియాలోనే నెం.1

గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది

సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. ఇంటర్ బోర్డు‌కు విద్యార్థి ఫోన్ కాల్

Follow Us