అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

Updated on: Jan 27, 2026 | 4:53 PM

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్కూబా డైవర్లు, నేవీ మాజీ అధికారి బలరాం నాయుడు నేతృత్వంలో 77 అడుగుల లోతులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశభక్తిని వినూత్నంగా చాటుతూ, ధైర్యం, క్రమశిక్షణల సందేశాన్నిచ్చిన ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

దేశమంతా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న వేళ, విశాఖ సాగర గర్భంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా, సముద్ర గర్భంలో స్కూబా డైవర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. విశాఖ తీరానికి సమీపంలోని ఋషికొండ ప్రాంతం నుంచి బోటులో కొద్ది దూరం వెళ్లి, స్కూబా డైవ్ ద్వారా సముద్రంలోకి దిగారు. సముద్రంలో 77 అడుగుల లోతులో జాతీయ జెండాను ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేవీ మాజీ అధికారి, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించింది. దాదాపు అరగంట పాటు సముద్ర గర్భంలోనే జాతీయ జెండాతో వారు ప్రదర్శన కొనసాగించారు. ఈ సందర్భంగా ఇద్దరు స్కూబా డైవర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒకరు గుర్రంలా, మరొకరు జాతీయ జెండా చేత పట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తున్నట్టుగా ప్రదర్శన ఇచ్చారు. ఈ వినూత్న దృశ్యం వీక్షకులను ఆకట్టుకుంది. ధైర్యం, క్రమశిక్షణ, రాజ్యాంగం పట్ల గౌరవాన్ని చాటేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని బలరాం నాయుడు తెలిపారు. జాతీయ జెండాను సముద్రంలోకి తీసుకెళ్లడం, 77 అడుగుల లోతులో ఆవిష్కరించడం, ఈ ఘట్టాన్ని కెమెరాల్లో బంధించడం మరో విశేషంగా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాశీ విశ్వనాధ్‌ ఆలయంలో రిపబ్లిక్‌ డే శోభ

దేశభక్తికి మాటలతో పనేముంది ?? సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం