మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు

Updated on: Jan 28, 2026 | 8:23 AM

విశాఖ మద్దిలపాలెం డిపోలో ఆర్టీసీ బస్సు మాయమై డ్రైవర్‌ను షాక్‌కు గురిచేసింది. పార్క్ చేసిన బస్సు కనిపించకపోవడంతో యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, మరో డ్రైవర్ పైడిరాజు బస్సును హైవేపై తీసుకువెళ్లినట్లు తేలింది. డీజిల్ అమ్మి మద్యం తాగాలనే ఉద్దేశంతోనే ఈ దొంగతనం చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. గతంలోనూ ఇలాగే బస్సు దొంగతనం చేసినట్లు బయటపడటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

విశాఖలో ఆర్టీసీ డ్రైవర్‌కు ఊహంచని అనుభవం ఎదురైంది. బస్టాండ్‌లో పార్ఖ్ చేసిన ఆర్టీసీ బస్సు మిస్సింగ్‌ కలకలం రేపింది. రాత్రి బస్సును బస్టాండ్‌లో పార్క్‌చేసి ఇంటికి వెళ్లిన డ్రైవర్‌.. మర్నాడు ఉదయం విధులు నిర్వహణకోసం వచ్చాడు. అయితే రాత్రి పార్క్‌ చేసిన బస్సు కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. మద్దిలపాలెం డిపోలో ఈ ఘటన జరిగింది. రాత్రి పార్క్ చేసిన బస్సు ఉదయానికి కనిపించకుండా పోయేసరికి ఒకింత కంగారుపడిన డ్రైవర్‌ చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ బస్సు కనిపించకపోవడంతో వెంటనే బస్సు యజమానికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. కంగారుపడిన యజమాని హుటాహుటిన బస్టాండుకు చేరుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశాఖలో నాయుడు అనే వ్యక్తికి ఆరు బస్సులున్నాయి. వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాడు. ఈ నెల 16న శ్రీకాకుళం నుంచి బస్సు మద్దిలపాలెం బస్టాండ్‌కు చేరింది. బస్సు డ్రైవర్ అప్పారావు 197 లీటర్ల డీజిల్ ఫుల్ చేయించి..రాత్రి 9.45 గంటల సమయంలో మద్దిలపాలెం డిపో పార్శిల్ కౌంటర్ వద్ద పార్క్ చేశాడు. డ్యూటీ దిగి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే.. మరుసటి రోజు ఉదయం డ్రైవర్ అప్పారావు వచ్చి చూసేసరికి బస్సు కనిపించలేదు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా, ఆ రాత్రి బస్సు హైవే మీదుగా బస్సు లంకిలపాలెం జంక్షన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నాయుడుదగ్గర పనిచేసే మరో డ్రైవర్‌ పైడిరాజుపై అనుమానం వచ్చింది. నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు పైడిరాజును రామా టాకీస్ సమీపంలో బస్సుతో పాటు పట్టుకున్నారు. మద్యానికి బానిసైన పైడిరాజు, బస్సులో ఉన్న డీజిల్ అమ్మి దానితో మద్యం తాగాలని ప్లాన్ చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా, గతేడాది ద్వారకానగర్ బస్టాండ్‌లో మిస్సయిన బస్సును కూడా తానే ఎత్తుకెళ్లి డీజిల్ అమ్ముకుని, ఆ తర్వాత బస్సును హైవేపై వదిలేసి పారిపోయినట్టు తెలిపాడు. అప్పట్లో బస్సు ఆచూకీ తెలిసింది కానీ, నిందితుడు ఎవరనేదీ ఇప్పటికీ తెలియరాలేదు. మళ్లీ ఇప్పుడు మరో బస్సు మిస్‌ అవడంతో విషయం మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు సైతం షాకయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూచిపూడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన నాట్యమయూరి