కేబుల్ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం
బాపట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు బయలుదేరిన హెడ్మాస్టర్ శ్రీనివాసరావు, రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతున్న ఫైబర్ కేబుల్ వైరు మెడకు చుట్టుకుని దుర్మరణం పాలయ్యారు. బైక్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చైనా మాంజా లాగే ఇప్పుడు కేబుల్ వైర్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయని, సంస్థల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందని నానుడి. ఈ ఘటన చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఇటీవల చైనామాంజాల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వీటి స్థానంలో కేబుల్ వైర్లు చేరాయి. చైనా మాంజాలే కాదు, రోడ్ల మీద వేలాడుతున్న కేబుల్ వైర్లు కూడా నిలువునా ప్రాణాలు తీస్తాయని నిరూపిస్తూ బాపట్ల జిల్లాలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు బయలుదేరిన కొద్దిసేపటికే ఒక ప్రధానోపాధ్యాయుడు మృత్యువాత పడ్డారు. బాపట్ల నుండి చీరాల మండలం గవినివారిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలకు హెడ్మాస్టర్గా పనిచేస్తున్న అంగిరేకుల శ్రీనివాసరావు ప్రతిరోజూ లాగే తన బైక్పై పాఠశాలకు బయలుదేరారు. చీరాల మండలం దేవినూతాల గ్రామ శివారుకు చేరుకోగానే, రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతున్న ఫైబర్ కేబుల్ వైర్ ఒక్కసారిగా ఆయన మెడకు చుట్టుకుంది. దీంతో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇంటి నుండి నవ్వుతూ బయలుదేరిన వ్యక్తి, కొద్దిసేపటికే విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. రోడ్లపై అడ్డదిడ్డంగా కేబుల్ వైర్లు వదిలేస్తున్న సంస్థల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడిని కోల్పోవడంతో గవినివారిపాలెం పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
