కలను సాకారం చేసిన.. రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్!

Updated on: Jul 12, 2026 | 5:12 PM

నల్లగొండ జిల్లా వెలిమినేడుకు చెందిన కొండే రఘుపతి, తన కలల ‘స్ప్లెండర్ ప్లస్’ బైక్‌ను రూ.10 నాణేలతో కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వ్యాపారాల ద్వారా వచ్చిన కాయిన్లను క్రమశిక్షణగా దాచుకుంటూ రూ.1.10 లక్షలు కూడబెట్టాడు. షోరూమ్ సిబ్బంది గంటల పాటు లెక్కించి బైక్ అందజేయగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా ఎవరైనా కొత్త బైక్ కొనాలంటే ఆన్‌లైన్ పేమెంట్ లేదా కరెన్సీ నోట్లను ఇస్తుంటారు. కానీ నల్లగొండ జిల్లాలో ఒక వ్యక్తి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం పది రూపాయల నాణేలతో తన కలల బైక్‌ను సొంతం చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి.. చాలా కాలంగా తనకు ఇష్టమైన ‘స్ప్లెండర్ ప్లస్’ బైక్ కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకోసం తను చేసే వివిధ వ్యాపారాల ద్వారా వచ్చిన రూ.10 నాణేలను ఎంతో క్రమశిక్షణతో పొదుపు చేస్తూ వచ్చాడు. ఆ బైక్ ధర రూ.1,10,000 కాగా, ఆ మొత్తాన్ని నోట్ల రూపంలో కాకుండా పూర్తిగా రూ.10 కాయిన్ల రూపంలోనే చెల్లించాలని రఘుపతి నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్‌కు పెద్ద పెద్ద సంచులతో వెళ్లాడు. ఆ సంచులను చూసి షోరూమ్ సిబ్బంది మొదట షాక్ తిన్నారు. అనంతరం సిబ్బంది అందరూ కలిసి గంటల తరబడి కూర్చుని ఆ కాయిన్లన్నింటినీ లెక్కించారు. మొత్తం లక్షా పదివేల రూపాయలు సరిగ్గా ఉండడంతో మేనేజర్ రఘుపతికి బైక్ తాళాలు అందజేశారు. చిన్న మొత్తాలనైనా క్రమశిక్షణతో పొదుపు చేస్తే పెద్ద లక్ష్యాలను సాధించవచ్చని రఘుపతి నిరూపించాడు. ఈ వింతను చూసేందుకు స్థానికులు షోరూమ్ వద్దకు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్‌తో వాహనాలు చెడిపోతాయా? నిజమెంత?

Follow Us