ఎలుగుబంట్ల బీభత్సం.. వణికిపోతున్న గ్రామ ప్రజలు

Updated on: Feb 13, 2026 | 10:41 AM

కడప జిల్లా, ఓబులవారిపల్లి మండలంలో గత మూడు రోజులుగా ఎలుగుబంట్ల దాడులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్న ఎలుగుబంట్లు పశువులపై, ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు గాయపడగా, రైతులు ప్రాణభయంతో ఉన్నారు. అటవీ శాఖ చర్యలు లోపించడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే బోన్లు ఏర్పాటు చేసి ఎలుగుబంట్లను బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలంలో గత మూడు రోజులుగా ఎలుగుబంట్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. అడవి నుంచి గ్రామాలపైకి వస్తున్న ఎలుగుబంట్లు వరుస దాడులతో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొదట ఒక ఆవుపై దాడి చేసిన ఎలుగుబంట్లు, ఆ తర్వాత ఒక యువకుడిని గాయపరిచాయి. తాజాగా…ఓబుల్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన రైతు అమర్‌నాథ్ రెడ్డి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. బాధితుడు కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుండి పారిపోయింది, లేదంటే అతని ప్రాణాలే పోయేవని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలుగుబంట్ల జాడ దొరక్కపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. “అడవి పందుల నుండి పంటలను కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో పొలాల్లోనే నిద్రపోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఎలుగుబంట్లు కూడా దాడులు చేస్తుంటే తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, బోన్లు ఏర్పాటు చేసి ఆ ఎలుగుబంట్లను బంధించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

Kona Venkat: కంటెంట్ ఉంటే.. సినిమా హిట్టే..

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

కేబుల్‌ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం

డయాబెటిస్ నిర్థారణకు.. HBA1C టెస్ట్‌ ఒక్కటే కరెక్ట్‌ కాదు!