యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..

Updated on: Jan 23, 2026 | 12:56 PM

యజమానిపై పెంపుడు కుక్క చూపిన అంతులేని ప్రేమ, విశ్వాసం అందరినీ కదిలించాయి. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో, ఆత్మహత్య చేసుకున్న యజమాని మృతదేహం పక్కనే కుక్క రాత్రంతా కాపలా కాసింది. పోస్టుమార్టం, అంత్యక్రియల వరకు నాలుగు కిలోమీటర్లు అనుసరించి, చితి వద్దే కూర్చుండిపోయింది. ఆహారం, నీళ్లు ముట్టకుండా యజమాని కోసం చూపిన ఈ అసాధారణ బంధం, మూగజీవుల గొప్ప ప్రేమకు నిదర్శనం. పోలీసులు సైతం చలించి ఈ ఘటనను ప్రశంసించారు.

యజమానిపై పెంపుడు జంతువులు చూపించే ప్రేమ, విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్న ఈ రోజుల్లో.. ఓ మూగజీవి తన యజమానిపై చూపిన అసాధారణ ప్రేమ అందరి హృదయాలను చలింపచేస్తోంది. యజమాని మరణించినా అతడిని విడిచి వెళ్లేందుకు నిరాకరించింది. శవం పక్కనే రాత్రంతా కాపలా కాసింది. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు తోడుగానే ఉండి కంటతడి పెట్టించింది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కదిలిస్తోంది. శివపురి జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో నివసించే 40 ఏళ్ల జగదీశ్ ప్రజాపతి సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఈ విషయాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా, జగదీశ్ మృతదేహం పక్కనే ఆయన పెంపుడు కుక్క మౌనంగా కూర్చుని ఉంది. రాత్రంతా అది అక్కడి నుంచి కదలకుండా యజమాని శవానికి కాపలాగా ఉంది. దాని నిశ్శబ్దం అక్కడున్న వారిని మరింత కలిచివేసింది. మరుసటి రోజు ఉదయం, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరేరా ప్రాంతానికి ఓ ట్రాక్టర్ ట్రాలీలో తరలించారు. తనకు ఇన్నాళ్లూ ఆదరించి, ఎంతో ప్రేమను పంచిన యజమాని ఇక కనిపించడని గ్రహించిన ఆ శునకం డెడ్‌బాడీని తీసుకెళ్తున్న వాహనాన్ని అనుసరించింది. దాదాపు నాలుగు కిలోమీటర్లు వాహనం వెనుక పరిగెత్తింది. దాని ఆవేదనను చూసి చలించిపోయిన కుటుంబసభ్యులు, దాన్ని కూడా ట్రాక్టర్‌లోకి ఎక్కించుకున్నారు. పోస్టుమార్టం కేంద్రం వద్ద కూడా అది మృతదేహం దగ్గరే ఉండిపోయింది. ప్రక్రియ పూర్తయ్యాక, మృతదేహంతో పాటే తిరిగి గ్రామానికి చేరుకుంది. అనంతరం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, ఆ శునకం చితి దగ్గరే కూర్చుండిపోయింది. కుటుంబసభ్యులు దానిని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కదల్లేదు. ఆహారం, నీళ్లు ఇచ్చినా ముట్టలేదు. యజమానిపై ఆ మూగజీవి చూపిన అంతులేని ప్రేమను చూసి అక్కడున్న పోలీసు అధికారులు సైతం చలించిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఈ శునకం విశ్వాసాన్ని ప్రశంసిస్తూ ఒక వీడియోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగదీశ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

డెలివరీ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే.. ‘ఏ పనీ తక్కువ కాదన్న నేత’

బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..

‘డిజిటల్ లంచం’.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌

పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి.. అలా ఎలా మావా