మా అమ్మ చనిపోదామంటోంది… ఆదుకోండి కలెక్టర్కు బాలుడు విజ్ఞప్తి వీడియో
గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నాలుగో తరగతి చదివే బాలుడు చెప్పిన మాటలు స్థానికులను కంటతడి పెట్టించాయి. అందరం చనిపోదామని అమ్మ అంటోందని అందుకే కలెక్టర్కు చెబుదామని వచ్చానని కళ్లలో నీళ్లు తిరుగుతుండగా బుచ్చి బుచ్చి మాటలతో ఆ బుడ్డోడు చెప్పిన మాటలు గుండెలవిసేలా చేశాయి. స్కూల్కు వెళ్లకుండా నేరుగా కలెక్టరేట్కు వచ్చి వినతిపత్రం ఇచ్చాడు. తమ కుటుంబానికి అన్నం పెట్టే టిఫిన్ బండిని కూల్చొద్దని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కాల్వలో పడేశారు. ఈ క్రమంలో తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకునేందుకు అనుమతించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందించాడు. తన సమస్యను అధికారులకు విన్నవించుకున్నాడు.
గుంటూరు నగరంలోని వెంకట్రావు పేటకు చెందిన అలవాల రాధిక స్థానిక ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద గతంలో టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగించేది. రోడ్డు విస్తరణ పనుల వల్ల ఇటీవల ఆ బండిని తొలగించారు. దీంతో జీవనోపాధి కోల్పోయామని ఆస్పత్రి బయట పరిసరాల్లో ఎక్కడైనా టిఫిన్ బండి పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని రాధిక పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని కుమారుడు యశ్వంత్ తెలిపాడు.తమ టిఫిన్ బండిని కాలువలో పడేశారని, జీవనానికి ఇబ్బందిగా ఉందని, బండి పెట్టుకోవడానికి అనుమతివ్వాలని కోరినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అమ్మ చనిపోదామని అంటోందని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గుండె సంబంధిత సమస్య ఉందని, టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతివ్వాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వినతి పత్రాన్ని తీసుకొని నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. యశ్వంత్ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరిన్నివీడియోల కోసం :