ఇస్రో సంచలన నిర్ణయం.. ఇకపై రాకెట్ల తయారీకి గుడ్ బై
భారత అంతరిక్ష రంగంలో ఇస్రో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. లాంచ్ వెహికల్స్, సాధారణ శాటిలైట్ల తయారీ వంటి వాణిజ్య కార్యకలాపాలను క్రమంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించనుంది. ఇకపై పరిశోధన, అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక శాస్త్రీయ మిషన్లపై ఇస్రో ప్రధానంగా దృష్టి పెట్టనుంది. PSLV, LVM-3 తయారీ హక్కులను కూడా భవిష్యత్తులో ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన కార్యకలాపాల్లో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై లాంచ్ వెహికల్స్, సాధారణ శాటిలైట్ల తయారీ వంటి వాణిజ్య కార్యకలాపాల నుంచి ఇస్రో క్రమంగా తప్పుకోనుంది. ఈ కీలక బాధ్యతలను పూర్తిగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించనున్నట్లు ఇన్-స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఓ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఈ విశేషాలను పంచుకున్నారు. ఇకపై ఇస్రో కేవలం ఒక తయారీ సంస్థలా కాకుండా, పూర్తిగా పరిశోధన మరియు అభివృద్ధి , అత్యాధునిక సాంకేతికతల రూపకల్పన, ప్రత్యేక శాస్త్రీయ మిషన్లపై మాత్రమే దృష్టి పెట్టనుంది. సాంకేతికత పూర్తిగా అభివృద్ధి చెంది వాణిజ్య వినియోగానికి సిద్ధమయ్యాక, వాటిని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే చిన్న ఉపగ్రహాల లాంచ్ వెహికల్ సాంకేతికతను హెచ్.ఏ.ఎల్. కు బదిలీ చేయగా, త్వరలోనే పీఎస్ఎల్వీ, ఎల్వీఎం-3 తయారీ హక్కులను కూడా ప్రైవేట్ రంగానికి అందించనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న లాంచ్ సెంటర్ నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే దిశగా కసరత్తు జరుగుతోంది. వచ్చే నాలుగు ఐదు నెలల్లో దీనికి సంబంధించిన ఆపరేటర్ ఖరారు కానున్నారు. మరోవైపు, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న 8 బిలియన్ డాలర్ల నుంచి 2033 నాటికి ఏకంగా 44 బిలియన్ డాలర్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ లక్ష్య సాధనలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అత్యంత కీలకం కానుంది. రక్షణ రంగం ఇప్పటికే ప్రైవేట్ సంస్థలకు 31 ఉపగ్రహాల తయారీ ఆర్డర్లు ఇవ్వడం విశేషం. ఈ చారిత్రాత్మక నిర్ణయం భారత అంతరిక్ష రంగాన్ని గ్లోబల్ మార్కెట్లో నంబర్ వన్ స్థానంలో నిలపడానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sugar Price: ఘాటెక్కిన చక్కెర.. పండగ వేళ సామాన్యులకు చుక్కలు
