బిడ్డా నాతోనే పెట్టుకుంటావా.. చిరుతకు చెమటలు పట్టించిన కోడి పుంజు.. ఇదిగో వీడియో
శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం పెరిగింది. సున్నిపెంట వద్ద ఓ చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించి కోళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ దృశ్యం వైరల్ అయ్యింది. భక్తులు, స్థానికులు పులుల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాంతం మొత్తం నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంటుంది.. దీంతో ఆ సమీప గ్రామాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచారం ఎక్కువగా ఉంటుంది. నిత్యం వేల మంది భక్తులు సంచరించే ప్రాంతంలో ఈ మధ్య కాలంలో చిరుతపులుల సంచారం మరింత ఎక్కవైపోయింది. తరచూ గ్రామాల్లోకి వస్తున్న పులులు జనాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సున్నిపెంట సమీపంలో వెలుగు చూసింది. అడవిలోంచి సడెన్గా గ్రామంలోకి వచ్చిన ఓ చిరుతపులి ఇంటి ఆవరణలో ఉన్న కోళ్ల బోన్ దగ్గరకు వెల్లింది. కోళ్లను చంపి తినేందుకు విశ్వప్రయత్నం చేసింది. కానీ బోనులో ఉన్న కోళ్ల మాత్రం ఆ చిరుతకు చిక్కకుండా దానికి చెమటలు పట్టించాయి. ఎంతసేపు ప్రయత్నించినా.. దానికి ఒక్క కోడి కూడా దొరకలేదు. దీంతో విసిగిపోయిన చిరుత చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ తతంగాన్నంత దూరం నుంచి గమనించిన స్థానికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే తమ ప్రాంతంలోకి చిరుతపులు రాకుండా చూడాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. చిరుతల సంచారంతో రాత్రి కంటిమీద కునుకు లేకుండా పోతుందని వాపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.