400 ఏళ్ల చరిత్ర అంతం కాబోతుందా ?? కొండపల్లి కళాకారుల కన్నీటి గాథ !!

Updated on: Apr 21, 2026 | 8:07 PM

కొండపల్లి బొమ్మలు తెలుగువారి సంప్రదాయ కళా నైపుణ్యానికి ప్రతీక. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బొమ్మల తయారీకి ప్రత్యేకమైన తెల్ల పొనికి కర్ర కొరత ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ కర్ర లభ్యత తగ్గడం వల్ల కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇది వారి జీవనోపాధిని, అరుదైన ఈ కళను ప్రమాదంలో పడేస్తోంది. తెల్ల పొనికి చెట్లు పెరగడానికి దశాబ్దాలు పడుతుంది కాబట్టి, వాటి సంరక్షణ, పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

కొండపల్లి బొమ్మలను ఎంత సేపు చూసినా తనివితీరదు. అంత అందం వాటి సొంతం. మరి.. అలాంటి బొమ్మలకు ఉపయోగించే తెల్ల పొనికి చెట్ల సంఖ్య తగ్గిపోతోందా? అదే జరిగితే.. 400 ఏళ్ల చరిత్ర ఉన్న కొండపల్లి బొమ్మల సంగతేంటి? అసలింతకీ ఈ బొమ్మలను ఆ కర్రతోనే ఎందుకు తయారుచేస్తారు? ఆ కర్ర లభ్యత తగ్గితే.. బొమ్మల తయారీనే నమ్ముకున్న వారి ఉనికి ఏమవుతుంది? తెలుగు వారి కళా నైపుణ్యానికి నిలువుటద్దం కొండపల్లి కొయ్య బొమ్మలు. సుమారు నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అరుదైన కళను భావితరాలకు పరిచయం చేసేందుకు పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కొండపల్లి బొమ్మల కోసం ప్రత్యేకమైన ఈవెంట్ ను ఏర్పాటు చేశాయి. అలాంటి కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన ‘తెల్ల పొనికి’ చెట్ల కొరత ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. కళాకారులను వేధిస్తోంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ చెట్లు అంతరించిపోతుండటంతో ముడిసరుకు కోసం సుదూర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. తెల్ల పొనికి చెట్లు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో కనుమరుగవుతుండడంతో దూరప్రాంతాల నుండి కర్రను తీసుకొచ్చి బొమ్మలు చెక్కుతుండడం వల్ల బొమ్మల రేట్లు పెంచవలసి వస్తుందని కళాకారులు అంటున్నారు. ఎక్కువగా తెల్ల పొనిక చెట్లు ఎన్టీఆర్ జిల్లాలో దొరుకుతాయని దానితోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు ఉంటాయి అని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. తెల్ల పొనికి చెట్లని వాడటానికి కూడా ఒక కారణం ఉందంటున్నారు. ఈ చెట్లలో రెండు రకాలు ఉంటాయన్నారు. తెల్ల పొనికి కర్ర బరువు తక్కువగా ఉంటుంది, దానితో పాటు కళాకారులు బొమ్మలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. అందుకే ఈ కర్రను ఎక్కువగా వాడతారని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో చెట్లను పెంచేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. తెల్ల పొనికి చెట్లను పెంచేందుకు కళాకారులకు కూడా ఫారెస్ట్ అధికారులు బాధ్యతలు అప్పగించారు. తెల్ల పోనికి చెట్లు పూర్తిగా పెరిగేందుకు దాదాపు 45 నుంచి 50 సంవత్సరాలు సమయం పడుతుంది. అందుకే ఈ చెట్ల సంఖ్య తగ్గిపోతోందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కొండపల్లి బొమ్మలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన తెల్ల పొనికి కర్ర కనుమరుగు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఫారెస్ట్ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవాలని స్థానిక కళాకారులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..

వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త

త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు

పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’

రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?

Follow Us