Iran Oil Tankers: భారత్‌కు చేరిన ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్‌లు

Updated on: Apr 15, 2026 | 7:00 PM

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు చమురు దిగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా విధించిన ఆంక్షలు సడలించడంతో రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో కూడిన నౌకలు గుజరాత్‌కు చేరుకున్నాయి. భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా, వెనెజువెలా నుంచి కూడా దిగుమతులను పెంచింది, ఇది దేశ ఇంధన భద్రతకు కీలకం.

యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్ కు చెందిన రెండు చమురు నౌకలు భారత్‌ కు చేరుకున్నాయి. ఏడేళ్ల తర్వాత ఇరాన్‌ చమురు భారతదేశానికి వచ్చినట్లయ్యింది. ఈ రెండు నౌకలు గుజరాత్‌ లోని సిక్కా పోర్టు తలో లంగరేశాయి. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన రెండు చమురు నౌకలు మార్చి మధ్యలో ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి. రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చాయి. అయితే ఈ నౌకలను ఎవరు కొనుగోలు చేశారన్న అంశాన్ని రహస్యంగా ఉంచింది భారత ప్రభుత్వం. అమెరికా పెట్టిన ఆంక్షల కారణంగా భారత్‌ 2019 నుంచి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలును నిలిపివేసింది. దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు ఇరాన్ నుంచి చమురు రవాణా జరగలేదు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు కొరత ఏర్పడింది. దాంతో ఇరాన్‌ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించింది. సముద్ర జలాల్లో ఉన్న ఇరాన్‌ చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రపంచంలోనే భారత్‌ మూడో అతి పెద్ద దేశం. ఇంధన కొరత కారణంగా ఇరాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్‌ ఇటీవల ప్రకటించింది. వెనిజుయెలా నుంచి 12 మిలియన్‌ బ్యారెళ్ల కంటే ఎక్కువ ముడిచమురు మన దేశానికి ఈ నెల చేరుకోనుంది. గత ఆరేళ్లలో వెనెజువెలా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన అత్యధిక పరిమాణంలో ఉన్న ముడిచమురూ ఇదే. గతంలో వెనెజువెలా నుంచి భారత్‌ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసేది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించాక, అక్కడనుంచి మనదేశానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించిన అమెరికా, ఆ దేశ చమురు విక్రయాలపై ఆంక్షలు సడలించింది. దీంతో మన దేశమూ కొనుగోళ్లను పునరుద్ధరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలులో 163 మంది చిన్నారుల అక్రమ రవాణా

బుక్ చేసి వారమైనా గ్యాస్‌ సిలిండర్‌ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?

Vande Bharat Sleeper: దక్షిణాదికి తొలి వందే భారత్ స్లీపర్.. ఆ మార్గంలోనే ప్రయాణం

ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం

గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు

Follow Us