UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే
డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్బీఐ యూపీఐ భద్రతకు కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. రూ.10,000 పైబడిన యూపీఐ లావాదేవీలకు ఒక గంట ఆలస్యం, 'కిల్స్విచ్' ఫీచర్, అలాగే సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ట్రస్టెడ్ పర్సన్ ఆమోదం వంటి చర్యలతో సైబర్ నేరాలను అరికట్టి, వినియోగదారుల డబ్బును సురక్షితంగా ఉంచడమే లక్ష్యం.
దేశంలో UPI పేమెంట్లు స్మార్ట్ ఫోన్ ద్వారా సెకన్లలో చేస్తున్నారు. అయితే అదే సమయంలో సైబర్ మోసాలతో వేలాది మంది మోసపోతున్నారు. తమ డబ్బును తిరిగి పొందలేకపోతున్నారు. గడిచిన ఐదేళ్లలో డిజిటల్ మోసాలు 10 రెట్లు పెరిగాయి. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు RBI కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తే క్షణాల్లోనే వారి ఖాతాలోకి ఆ డబ్బులు జమ అవుతుంటాయి. ఇకపై రూ.10,000 మించి పంపించినప్పుడు ఖాతా నుంచి ఖాతాకు జరిగే బదిలీలు ఒక గంట ఆలస్యం అవుతాయి. అంటే మీరు పంపించే డబ్బు వెంటనే మీ ఖాతా నుంచి కట్ అయి అవతలి వ్యక్తికి అందదు. ఆ సమయంలో కస్టమర్ ఖాతా నుంచి తాత్కాలికంగా డెబిట్ అవుతుంది. ఒక వేళ పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బు కట్ అయినట్లు తెలిస్తే ఆ గంట లోపు ట్రాన్సాక్షన్ రద్దు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకే ఈ కొత్త రూల్స్ తీసుకురానున్నారు. దీంతో పొరపాటున లేదా మోసపూరితంగా డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు గుర్తిస్తే వెనక్కి తీసుకునేందుకు అవకాశం లభించనుంది. కొత్త మార్పులతో పాటు కిల్ స్విచ్ అనే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ఆర్బీఐ. ఫోన్ పోయినా, బ్యాంక్ ఖాతా హ్యాక్ అయినట్లు అనుమానం వచ్చినా ఒక్క క్లిక్ తో మీ డిజిటల్ పేమెంట్ల పద్ధతులన్నింటినీ వెంటనే నిలిపివేసేందుకు ఈ కొత్త కిల్ స్విచ్ ఫీచర్ అవకాశం కల్పిస్తుంది. ఈ కొత్త ప్రతిపాదనలపై మే 8వ తేదీ వరకు అభిప్రాయాలు సేకరించనుంది ఆర్బీఐ. ఆ తర్వాత అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధన తీసుకురానుంది. 70 ఏళ్ల వయసు దాటిన వారు రూ.50 వేలకు మించి డబ్బులు పంపించినప్పుడు ట్రస్టెడ్ పర్సన్ ఆమోదాన్ని తప్పనిసరి చేయాలని చూస్తున్నారు. దీని ప్రకారం వృద్ధులు పెద్ద మొత్తంలో డబ్బులు పంపితే వారి నామినీకి లేదా బంధువులకు ఒక హెచ్చరిక వెళ్తుంది. వారు ఆమోదిస్తేనే ఆ పేమెంట్ పూర్తవుతుంది. సైబర్ నేరాలలో ఎక్కువగా వయసు మళ్లినవారు, దివ్యాంగులు ఉండడంతో అదనపు భద్రతా వ్యవస్థను తీసుకురావాలని యోచిస్తున్నారు. అలాగే ఈ ఫీచర్ అవసరం లేదనుకునే వృద్ధులకు సైతం ఆప్షన్ ఇవ్వనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం
చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్
భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం.. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్తో డ్రామా
Aditya Dhar: ప్రభాస్ లెజెండ్ అంటూ.. ధురంధర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్
