
బిడ్డ మీద తల్లికి ఉండే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. బిడ్డకు ఆపద ఉన్నదంటే ప్రాణాలను ఆడ్డేసైనా కాపాడుకుంటుంది. మనిషి అయినా, జంతువు అయినా తన పిల్లలను కంటికి రెర్పలా కాపాడుకుంటుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియలో అనేకం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వార్తనే ఒకటి చక్కర్లు కొడుతోంది. తన ఐదేళ్ల కుమారుడిని కాపాడుకోవడానికి ఓ తల్లి ఏకంగా మొసలితో కలపడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బహ్రాయిచ్లోని ధాకియా గ్రామంలో చోటుచేసుకుంది.
సోమవారం సాయంత్రం ఒక తల్లి తన ఐదేళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి మొసలితో పోరాడింది. ఇంటి దగ్గర కాలువ వద్ద బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఓ హఠాత్పరిణామం జరిగింది. ఒక మొసలి అకస్మాత్తుగా నీటి నుండి బయటకు వచ్చి బాలుడిని పట్టుకుంది. మొసలి బాలుడిని నీటిలోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా, అతని అరుపులు విన్న తల్లి మాయ (40) శివంగిలా మారింది. వెంటనే అక్కడికి పరుగున వెళ్లి మొసలితో పోరాటం చేసి బిడ్డను కాపాడుకుంది.
మొసలితో మాయ ఐదు నిమిషాలపాటు వీరోచితంగా పోరాడినట్లు స్థానికులు తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆమె తన చేతులతో మొసలిని కొడుతూ తన కొడుకును రక్షించుకుంది. తరువాత ఆమెకు ఒక ఇనుప రాడ్ దొరకడంతో మొసలిపై బలంగా దాడి చేసింద.ఇ వెంటనే అది ఆమె కొడుకును వదిలిపెట్టింది. ఈ పోరాటంలో తల్లి మాయతో పాటు కుమారుడు ఇద్దరూ గాయపడ్డారు. మాయకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు, కానీ వీరుకి తీవ్ర గాయాలు కావడంతో ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు.
తన పోరాటంపై మాయ స్పందించారు. “మొసలి నా కుమారుడిని కిందకు లాగుతోంది, కానీ నేను నా శక్తినంతా ఉపయోగించి పట్టుకున్నాను. నేను దాన్ని కొట్టాను, నా దగ్గర ఉన్న ప్రతిదానితో నేను పోరాడాను. చివరికి, నేను పట్టుకున్న ఇనుప రాడ్తో గట్టిగా బాదడంతో దెబ్బ తగిలిన తర్వాత అది నా బిడ్డను వదిలేసింది. నా కొడుకు బతికిపోయాడు అదే నాకు ముఖ్యం.” అంటూ మాయ చెప్పుకొచ్చింది.
ఈ సంఘటన గురించి మాజీ గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ సింగ్ అధికారులకు సమాచారం అందించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టింది. మొసలిని పట్టుకోవడానికి ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. హామీ ఇచ్చారు.