తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం… స్వయంభువుగా శివుడు!

ప్రపంచంలో ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం ఉంది. అంతే కాకుండా ఆయన చాలా ఏళ్లపాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనది. అదే  తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో ఉన్న […]

తిరువిడై మరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం... స్వయంభువుగా శివుడు!
Follow us

| Edited By:

Updated on: Oct 11, 2019 | 10:46 AM

ప్రపంచంలో ఒకే ఒక చోట ఆ పరమశివుడు ప్రతిష్టించిన శివలింగం ఉంది. అంతే కాకుండా ఆయన చాలా ఏళ్లపాటు తపస్సు చేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టాడని చెబుతారు. అందువల్లే ఆ శివలింగం భూమిపై ఉన్న అన్ని శివలింగాల కంటే విశిష్టమైనది. అదే  తిరువిడైమరుదూర్ శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని మధ్యార్జునం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శివుడు మహాలింగేశ్వరుడు. ఈ ఆలయం చాలా పెద్దది. ఆలయంకు తగ్గట్లే ఆలయంలో ఉన్న శివలింగం కూడా చాలా పెద్దగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ బృహత్ సుందర గుజాంబాల్ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి వార్లు కొలువైన ఈ ఆలయం తమిళనాడు లోని అతి పెద్ద ఆలయా లలో ఒకటిగా పేరొందినది. దీనిని చోళ రాజులు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించారు. ఇది అతి పురాతన ఆలయం. చాలా ప్రశాంతంగా,మనసులో భక్తిభావం పెల్లుబికేలా ఉంటుంది.

ఇక ఇక్కడ అరుదుగా కనిపించే తెల్ల మద్ది చెట్లు మనకు కనిపిస్తాయి. తిరువిడైమరుదూర్ ఆలయం ప్రాంగణంలో ఉండే మద్ది చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వాసం. ఇటువంటి మద్ది చెట్లు కేవలం మధ్యార్జునం , శ్రీశైలంలో మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే భారత దేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబిక దేవి ఆలయాన్ని కూడా చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం..

కుంభకోణం దగ్గర్లోనే

సృష్టి మొదలయ్యినప్పుడు బ్రహ్మ దేవుడు రూపొందించిన కలశం మొదట భూమిపై తాకిన ప్రదేశం కుంభకోణం. అందువల్లే ఈ క్షేత్రాన్ని అతి పవిత్రమైన ప్రాంతంగా హిందూ పురాణాల్లో పేర్కొంటారు. అటువంటి కుంభకోణం దగ్గర్లోనే తిరువిడైమరుదూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది.

పురాణాల ప్రకారం

ఈ క్షేత్రం గురించి భారతీయ పురాణాల్లో పేర్కొనబడింది. సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని. పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

స్వయంభువుగా మహాలింగస్వామి 

అందువల్లే ఈ శివలింగానికి అంతటి శక్తి అని చెబుతారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని మహాలింగస్వామి అని పిలుస్తారు. మహాలింగస్వామి స్వయంభువు. భక్తితో ఈయన ఆలయానికి ప్రదక్షిణ చేసివారికి ఏ విధమైన మానసిక బాధలైనా తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, వివాహం, పిల్లలు, ఉద్యోగం వగైరా సకల కోరికలూ నెరవేరుతాయట.ఈయన ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలుకు, సప్త విగ్రహ మూర్తులకు మధ్యలో కొలువుతీరి ఉన్నాడు. చిదంబరంలోని ఉన్న నటరాజ స్వామి ఆలయంలోని నటరాజు, తిరు చెంగళూరులోని చండికేశ్వరుడు, తిరువలంజులిలోని వైట్ వినాయకుడు, స్వామిమలై లో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలయాల్లో ఉన్న సూర్యుడు, అలాన్ దేవాలయంలోని దక్షణామూర్తి.

నాలుగు దిక్కుల్లో

ఇక ఈ దేవాలయానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. అవి తూర్పు వీధిలో విశ్వనాథుడు, పడమట ఉన్న బుుషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఉన్న ఆత్మనాధుడు, వీధిలో ఉన్న చొన్ననాధుడు. ఇంతటి విశిష్టమైన దేవాలయంను హిందువులు ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

నంది చాలా పెద్దది

ఆలయ మండపంలో ఉన్న నంది చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే ఇది ఒకే శిలతో చేయబడలేదు. అందువల్ల అంత బరువుగా ఉండదని చెబుతారు. ఈ మహాలింగస్వామికి భక్తితో ప్రదక్షిణ చేస్తే ఏవిధమైన మానసిక బాధలైనా తొలిగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వివాహం, పిల్లలు కావాల్సిన వారు ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు ఈ ఆలయంలో ప్రవేశ ద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుందని చెబుతారు. ఇందుకు సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకసారిపాండ్య రాజు వరుగుణ పాండ్యన్ అడవిలో వేటకి వెలుతాడు. తిరిగి వచ్చే సరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో అతని గుర్రం ఒక బ్రాహ్మణుడి మీదుగా వెళ్లి అతిని చావుకు కారణమవుతుంది. దీంతో అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. శివ భక్తుడైన పాండు రాజు శివుడిన ప్రార్థిస్తాడు.

కలలో శివుడు 

శివుడు కలలో కనిపించి తిరువిడైమరుదూర్ వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాల్సిందిగా సూచిస్తాడు. దీంతో రాజు తిరువిడైమరుదూర్ వెళ్లి తూర్పు ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తాడు. అతన్ని అన్ని చోట్లకు వెంటాడుతున్న బ్రహ్మహత్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉండి పోతుంది.

బ్రహ్మహత్య దోషం

ఇక రాజు శివుడిని ఆరాధించే సమయంలో ఒక అశరీర వాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారం నుంచి కాక వేరే ద్వారం గుండా వెళ్లమని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. దీంతో ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని లోనికి వెళ్లిన వారు ఎవరైనా ఈ ద్వారం గుండా వస్తే బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు.

మధ్యార్జునం

ఈ పవిత్రక్షేత్రానికి మధ్యార్జునం అని కూడా పేరు. ఉత్తరంలో ఉన్న శ్రీశైల మల్లికార్జునిడికి, దక్షిణాన ఉన్న తిరుపుట్టైమరుదూరుకు మధ్యన ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని మధ్యార్జునం అని అంటారు. అర్జునం అంటే మద్ది చెట్టు. ఈ మూడు క్షేత్రాల్లో మాత్రమే అత్యంత అరుదైన మద్ది చెట్టును మనం చూడగలం.

మూకాంబిక దేవాలయం

ఇక ఈ ఆలయం పక్కనే మనకు భారత దేశంలో అత్యంత మహిమాన్విత ఆలయాల్లో ఒకటిగా చెప్పబడే మూకాంబిక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొన్న స్థితిలో మనకు కనిపిస్తుంది. మూకాసురుణ్ణి చంపడం వల్ల వచ్చిన బ్రహ్మ హత్యా దోషం పోవడానికి ఇక్కడ తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతుంది.

సంతానం కోసం

కర్నాటకలోని మూకాంబిక దేవి ఆలయం వలే ఈ ఆలయం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినది. ఈమెను చాలా శక్తికల దేవతగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ హత్య దోషం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని స్థానిక భక్తులు పూజిస్తారు.

ఎలా చేరుకోవాలి

రోడ్డు మార్గం:

తిరువిడై మరుదూర్ కు కుంబకోణం బస్ స్టాండ్ చాలా దగ్గర. అక్కడి నుండి జిల్లా సర్వీస్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం:

తిరువిడై మరుదూర్ కు కేవలం 9కిలోమీటర్ల దూరంలో కుంబకోనం రైల్వే స్టేషన్ ఉంది.. అక్కడి నుండి లోకల్ బస్స్ సర్వీలు ఉన్నాయి.

విమాన మార్గం:

98కిలోమీటర్ల దూరంలో తిరుచురాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. అక్కడి నుండి బస్సు, టాక్సీ ల ద్వారా తిరువిడై మరుదూర్ చేరుకోవచ్చు.