దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు
దొంగతనం చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి నిద్ర రావడంతో అదే ఇంట్లో మంచం కింద గురకపెట్టి సోయి లేకుండా నిద్రపోయాడు.
దొంగతనం చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి నిద్ర రావడంతో అదే ఇంట్లో మంచం కింద గురకపెట్టి సోయి లేకుండా నిద్రపోయాడు. ఆ సౌండ్ కు మెలకువ వచ్చిన ఇంటి ఓనర్ పోలీసులకు దొంగను పట్టించాడు. ఈ విచిత్ర ఘటన తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పెట్రోల్ బంక్ నిర్వహించే సత్తి వెంకటరెడ్డి శుక్రవారం రాత్రి 10.15 గంటలకు బంక్ పనులు పూర్తి చేసుకుని క్యాష్ బ్యాగ్తో తన ఇంటికి చేరుకున్నాడు. వెంకటరెడ్డికి తెలియకుండా అతని వెనుకే వచ్చిన ఓ దొంగ గదిలోకి ప్రవేశించి మంచం కింద దాక్కున్నాడు.
బంక్కు సంబంధించిన లెక్కలు చూసుకుంటూ వెంకటరెడ్డి రాత్రి 1 గంట వరకు మెలకువగానే ఉండడంతో..దొంగ ఈ లోపులో మంచి స్లీప్ వేశాడు. అనంతరం వెంకటరెడ్డి కూడా నిద్రించాడు. తెల్లవారుజామున గురక శబ్ధం రావడంతో మెలకువ వచ్చి రూమ్ అంతా వెతక్కా.. మంచం కింద ఓ వ్యక్తి కనిపించాడు. ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌసులు ధరించిన అతడు గాడ నిద్రలో ఉన్నాడు. వెంటనే వెంకటరెడ్డి తన భార్యతో కలిసి గది నుంచి బయటకు వచ్చి, తలుపుకు గడియ పెట్టి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగ మొహానికున్న మాస్క్ తొలగించి చూడగా ఆ వ్యక్తి తనకు బాగా పరిచయం ఉన్న సోడమిల్లి సూరిబాబు అని గుర్తించి వెంకటరెడ్డి షాకయ్యాడు. కాగా, తనకు డబ్బు చాలా అవసరమని, అందుకే దొంగతనం చేయాలనుకున్నానని ఆ వ్యక్తి పోలీసుల విచారణలో చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు.
Also Read : తన కల నెరవేరిందంటున్న పాయల్