మేడారం అడవుల్లో మహా ప్రళయం.. సమ్మక్క సారలమ్మల దయతో పెను విపత్తు తప్పిందా..!

| Edited By: Janardhan Veluru

Sep 05, 2024 | 3:46 PM

సాధారణంగా పెద్ద గాలి వేసిందనుకోండి.. పదోపరకో చెట్లు పడిపోవడం సహజం. అదే సుడిగాలి వస్తే మరికొన్ని చెట్లు పడిపోవడం చూస్తుంటాం. కానీ, రాత్రికి రాత్రి 50 వేల చెట్లు.. అదీ అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా? అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది మనం చెప్పుకున్నంత సులువేనా? చెట్లు నేల కూలడానికి అసలు కారణాలు ఏంటి..? అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా..?

మేడారం అడవుల్లో మహా ప్రళయం.. సమ్మక్క సారలమ్మల దయతో పెను విపత్తు తప్పిందా..!
Medaram Forest
Follow us on

ఉమ్మడి వరంగల్‌ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాల్లోని తాడ్వాయి అడవుల్లో అలజడి రేగింది. అటవీ ప్రాంతంలో అసలేం జరుతోంది..? రాత్రికి రాత్రికి వేలాది వృక్షాలు వేర్లతో సహా పీకి పారేసినట్టుగా నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో 50 వేలకుపైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయంటే మామూలు విషయం కాదు. పడిపోయిన చెట్లు కూడా చిన్న సైజు చెట్లు కాదు. మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోవడం మిస్టరీగా మారింది.

సాధారణంగా పెద్ద గాలి వేసిందనుకోండి.. పదోపరకో చెట్లు పడిపోవడం సహజం. అదే సుడిగాలి వస్తే మరికొన్ని చెట్లు పడిపోవడం చూస్తుంటాం. కానీ, రాత్రికి రాత్రి 50 వేల చెట్లు.. అదీ అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా? అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది మనం చెప్పుకున్నంత సులువేనా? చెట్లు నేల కూలడానికి అసలు కారణాలు ఏంటి..? అక్కడి నేల స్వభావం ఏమైనా మారిందా..? అభయారణ్యం మొత్తం కదిల్చిన ఈ విపత్తును ఏమంటారు..? అదే ఇప్పుడు ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌తో పాటు స్థానికులనూ ఆందోళనకు గురి చేస్తోంది.

మొన్నటి వరకు ఉన్న మహావృక్షాలు ఏమైపోయాయి అని అడిగిన ప్రశ్నకు అటవీశాఖ అధికారులు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు. శాస్త్రీయ కారణాలను అన్వేషిస్తున్నారు. చెట్లు కూలిపోయిన ప్రాంతం నుంచి మట్టి శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపు మూడు మీటర్ల లోతులో నుంచి మట్టి శాంపిల్స్ తీసుకుని, వాటిని ల్యాబ్‌కు పంపిచారు. శాటిలైట్ సర్వే ద్వారా కూడా అసలు ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మేడారంలో వచ్చింది టోర్నడోనేనా?

మేడారం అడవుల్లో ఈ భారీ వృక్షాలు నేలకొరగడాన్ని బట్టి.. కనీసం గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే కారణమై ఉండొచ్చు అని కొందరి అంచనా…! అయితే ఎంత పెద్ద గాలి వీచినా ఎప్పుడైనా అడవిలో ఒకటీ అరా చెట్లు పడిపోవడం జరగవచ్చు. కానీ, ఇలా వేలాది చెట్లు పడిపోవడం చూస్తుంటే.. ఇది టోర్నడో ఎఫెక్టేనా అనేది చర్చనీయాంశంగా మారింది.

మీకు టోర్నడోలు తెలుసు కదా..! భయంకరమైన వేగంతో సుడిగాలి చుట్టేస్తుంది. క్షణాల్లో ఎంత పెద్ద చెట్టయినా, ఇల్లయినా కూడా నేలమట్టం చేసి పడేస్తుంది. ఈ తరహా టోర్నడోల విలయాన్ని ఫారిన్ కంట్రీస్‌లో చూస్తూ ఉంటాం. కానీ ఈ విధ్వంసం చూసిన తర్వాత మన తెలంగాణలో కూడా వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Medaram Forest

టోర్నడో అంటే ఏంటి?

ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో… తుఫాన్ల నుంచి వరదల వరకు మనకు చాలా సుపరిచితమే..! కానీ.. అంతకన్నా భయంకరమైనది ఇది. అది వచ్చే ముందు ఎలాంటి సూచనలు ఉండవు.. దాడి మొదలైన తర్వాత తప్పించుకునే మార్గం కూడా ఉండదు.. ఐదు నిమిషాల నుంచి అరగంట వ్యవధిలో తన పరిధిలో ఉన్న సమస్తాన్ని సర్వనాశనం చేస్తుంది. ఊళ్లకు ఊళ్లను నేలమట్టం చేస్తుంది.

ఏ గాలి.. జీవరాశికి ప్రాణధాతువుగా వీస్తుందో.. అదే వాయువు సకల ప్రాణికోటిని కల్లోల పరుస్తుంది.. అదే టోర్నెడో..!! టోర్నెడో అంటే కేవలం సుడిగాలి కాదు.. ప్రకృతిని కకావికలం చేసే ప్రళయం.. ఈ గాలి సునామీ బలం ముందు.. మరే ఇతర శక్తి పని చేయదు.. బలమైన భవనాలు కుప్పకూలాల్సిందే.. వందల ఏళ్ల వయస్సున్న చెట్లను సైతం కూకటివేళ్లతో పెకలించే సత్తా కూడా ఈ టోర్నెడో సొంతం. సరిగ్గా ఏడాది కింద చైనాలో ఓ టోర్నెడో విలయతాండవం చేసింది.. సర్వస్వాన్నీ నేలమట్టం చేసింది.

టోర్నడో ఒక భీకరమైన సుడిగాలి. టోర్నడోలను ట్విస్టర్‌, సుడిగాలి, తీవ్రమైన గాలి తుపాను అని కూడా అంటూ ఉంటారు. ఇవి వివిధ పరిమాణాలు, ఆకారాలుగా ఏర్పడుతుంటాయి. ఉరుములు, మెరుపులను కలిగించే మేఘాల్లో కనిపిస్తుంటాయి. క్యుములోనింబస్‌ మేఘాలు, మేఘాల కింద తిరిగే వ్యర్థాలు, ధూళి కణాలు నుంచి టోర్నడోలు పుట్టుకొస్తాయి. టోర్నడోలు చాలా వరకు గంటకు 180 కిలోమీటర్ల వేగం గాలులతో.. 250 అడుగుల వరకు వైశాల్యంతో కూడి ఉంటాయి. ప్రారంభ స్థానం నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఒక్కోసారి అవి గంటకు 480 కిలోమీటర్ల వేగంతోనూ విజృంభించే ప్రమాదం ఉంటుంది. వైశాల్యం మూడు కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. అలా ఏకబిగిన 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. ఇది ప్రయాణించిన మార్గం మొత్తం విధ్వంసమే.

Medaram Forest

తెలంగాణలో టోర్నడోలు

తెలంగాణలో అడపాదడపా కన్పిస్తుంటాయి. గాలి గింగిరాలు తిరిగే సుడిగాలి చిత్రాలు 2021 అక్టోబర్‌లో కరీంనగర్ శివారు తిమ్మాపూర్‌ మండలం వచ్చునూర్‌ గ్రామ శివారు లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్‌లో నీరు సుడిగాలిలో చిక్కుకొని తిరుగుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అద్భుత దృశ్యం స్థానికులకు కనువిందు చేసింది. అంతకు ముందు ఐదేళ్ల క్రితం కూడా ఇలాంటి సీనే కన్పించింది. అప్పుడు జాలర్లు, స్థానికులు కాస్త భయపడ్డారు. ఇది వాటర్‌ స్పౌట్‌ అని తేల్చడంతో ఆ దృశ్యాన్ని అంతా ఎంజాయ్‌ చేశారు.

సాధారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఇలాంటి టోర్నడోలు కనిపిస్తుంటాయి. తెలంగాణలో గతంలో ఎప్పుడూ ఇలాంటి అరుదైన దృశ్యం చూడలేదు. స్థానిక ప్రజలు ఈ వాటర్ స్పాట్ చూసి ఆశ్చర్యానికి, ఒకింత భయానికి గురయ్యారు. విదేశాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి టోర్నడోలు ఏకంగా గ్రామాలను సైతం నాశనం చేసిన ఘటనలు ఉన్నాయి. ఇళ్ల మీదుగా టోర్నడో ప్రయాణిస్తే.. కట్టడాలన్నీ నామరూపాలు లేకుండా నాశనం అయిపోతాయి. 2016 జూలై 31న ఇదే జలాశయం నడి మధ్యలో వాటర్ స్పాట్ ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు తమ సెల్‌ఫోన్స్‌లో క్లిక్‌మనిపించిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

2022 ఆగస్టులో మహబూబాబాద్‌ జిల్లాలో టోర్నడోల కలకలం రేపింది.కొత్తగూడ మండలం వేలుబెల్లిలో ఆకాశం పైకి నీళ్లు వెళ్తున్న దృశ్యం కనిపించింది.. జిల్లాలో వింతగా టోర్నడో దర్శనం ఇవ్వడం చూసిన అక్కడి ప్రజలకు ఒళ్లంతా వణుకు పుట్టింది..దీంతో భయంతో పరుగులు పెట్టారు..సుడిగాలి నీళ్లను తీసుకొని రివ్వున ఆకాశానికి చేరింది..దీంతో అక్కడ గ్రామ ప్రజలు సమీపంలో పనిచేస్తున్న కూలీలు కాసేపు భయపడ్డా.. ఆ తర్వాత మాయం అవడంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు..ఆకాశాన్ని, భూమిని తాకుతూ ఏర్పడే పెద్ద పెద్ద ఈ సుడిగాలులు మన దేశంలో చాలా తక్కువ. ఇలాంటివి ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే చూస్తుంటాం..ఏటా ఆ దేశంలో దాదాపు 1200 టోర్నడోలు సంభవిస్తుంటాయి.ఈ టోర్నడోలు వచ్చే సమయంలో మామూలు బీభత్సం ఉండదు.. దానికి ఏది అడ్డొచ్చిన ఆ దుమ్ములో కలిసి పోవాల్సిందే.

Medaram Forest

ఈ టోర్నడోల బీభత్సానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించిన దాఖలాలున్నాయి. అయితే భారత్‌లో మాత్రం టోర్నడోలు చాలా అరుదనే చెప్పాలి. అలాటిది ఏజెన్సీలోని కొత్తగూడ మండలం వెలుబెల్లిలో ఈ ఘటన చోటుచేసుకోవడం కాస్త వింతంగా అనిపించింది.. ఒక్కసారిగా సుడిగాలిలా ప్రారంభమై నిమిషాల్లోనే పెద్దదయి నీళ్లు ఆకాశంలోకి వెళ్లాయి.ఇలా ఆకాశం పైకి నీళ్లు వెళ్తున్న దృశ్యం అక్కడి ప్రజలు ఆందోళనకు గురి చేసింది..టోర్నడో వేగంగా సుడులు తిరుగుతూ అల్లకల్లోలం చేసింది.మరోవైపు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు.

మంత్రి సీతక్క స్పందన

మేడారం అడవుల్లో చెట్లు నెల‌కొర‌గ‌డంపై మంత్రి ధనసరి అనసూయ సీత‌క్క స్పందించారు. స‌చివాల‌యం నుంచి పీసీసీఎఫ్‌, డీఎఫ్ఓల‌తో టెలిఫోన్‌లో ఆరా తీశారు. చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక్క రెండు రోజుల క్రితమే సందర్శించారు. భారీ సంఖ్యలో చెట్లు నేల కూలడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ‘ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయి. వందల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాం. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశాం’ అని ఆమె తెలిపారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని చెప్పారు. స‌మ‌క్క సార‌ల‌మ్మ త‌ల్లుల ద‌య వ‌ల్లే సుడిగాలి ఊర్ల మీద‌కు మళ్లలేదన్నారు. చెట్లు నెల‌కూల‌డంపై కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ ప్ర‌త్యేక చర్యలు తీసుకోవాలని సీతక్క కోరారు. కేంద్రం నుంచి ప‌రిశోధ‌న జ‌రిపించి కార‌ణాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అట‌వి ప్రాంతంలో చెట్ల‌ను పెంచేలా ప్ర‌త్యేక నిధులను కేంద్రం మంజూరు చేయాలని కోరారు.

నిపుణులు ఏమంటున్నారు?

వాతావరణంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయన్నారు పర్యావరణ వేత్త ప్రొఫెసర్‌ నర్సింహా రెడ్డి. ప్రజలు ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ అడవులను సంరక్షించుకోవాలని సూచించారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి