Telangana: తండ్రిని పట్టించుకోని కొడుకు.. దిమ్మతిరిగేలా షాకిచ్చిన కలెక్టర్.. అసలేం జరిగిందంటే..

| Edited By: Shaik Madar Saheb

Sep 03, 2024 | 9:14 PM

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని ఘటనలను ఎన్నో చూశాం.. అలాంటి వారికి దిమ్మతిరిగేలా షాకిచ్చారు కలెక్టర్.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana: తండ్రిని పట్టించుకోని కొడుకు.. దిమ్మతిరిగేలా షాకిచ్చిన కలెక్టర్.. అసలేం జరిగిందంటే..
Peddapalli Collector
Follow us on

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని ఘటనలను ఎన్నో చూశాం.. అలాంటి వారికి దిమ్మతిరిగేలా షాకిచ్చారు కలెక్టర్.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కుమారుడైన గడ్డం స్వామిరెడ్డికి వివిధ సర్వే నంబర్లలోని తనకున్న 6 ఎకరాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేశారు. అయితే కొంతకాలంగా తన బాగోగులు చూసుకోవట్లేదని కొడుకుపై పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

అయినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసేందుకు దరఖాస్తు సమర్పించారు. ఆ దరఖాస్తును అప్పీలుగా స్వీకరించి ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆర్డీవో ఉత్తర్వుల అమల్లో స్వామిరెడ్డి నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ నిర్ధారించారు.

దీంతో వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని నిర్ణయించారు. అలాగే తండ్రి పోషణకు ప్రతి నెలా రూ. 10వేలను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కుమారుడు స్వామి రెడ్డి, కుమార్తె సింగిరెడ్డి లతను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత సంతానంపై ఉంటుందని.. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..