Telangana: తెలంగాణ వాసులకు చల్లటి కబురు.. 14 జిల్లాల్లో వర్షాలు
ప్రజంట్ సమ్మర్ పీక్ సీజన్ అని చెప్పాలి. ఉదయం 8 నుంచి సూర్యుడు చెలరేగిపోతున్నాడు. జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు వేసుకున్నా ఊరట అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో చల్లటి కబురు అందించింది వాతావరణ శాఖ. 14 జిల్లాలకు వర్ష సూచన చేసింది.
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. తాజాగా కరీంనగర్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 45.4 డిగ్రీల సెల్సియస్ నమోదైన క్రమంలో ఇది ఎండల నుంచి ఊరట ఇచ్చే వార్త అనే చెప్పాలి.
తెలంగాణలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లె, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఉష్ణోగ్రత తగ్గే అవకాశం
IMD హైదరాబాద్ చెబుతున్న వివరాల ప్రకారం, ఉరుములతో కూడిన వర్షం కారణంగా, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల సెల్సియస్కు పడిపోవచ్చు. అయితే, ఈ ఉష్ణోగ్రత తగ్గుదల వర్ష సూచన చేసిన జిల్లాల్లో మాత్రమే అంచనా వేయబడింది. రాష్ట్రం మొత్తం కాదు.
కాగా శనివారం జగిత్యాల, ములుగు, నల్గొండ, కరీంనగర్లలో 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద అత్యధికంగా 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలోని బహదూర్పురా, షేక్పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, గోల్కొండ, ఆసిఫ్నగర్, బండ్లగూడ, సైదాబాద్, మారేడ్పల్లిలో 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భారత వాతావరణ శాఖ హైదరాబాద్లోని వివిధ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేయడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..