ఆదివారం సెలవు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడు కుటుంబాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. నలుగురు చిన్నారులు జలసమాదయ్యారు. సరదాగా ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్న ఒక్కరోజే రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు గ్రామ శివారులోని మడుగులో ఈతకు వెళ్లారు. వీరిలో యాకూబ్(12), జంపన్న(10) అనే ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు.
అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ రావ్ మండలం తాడిచెర్లలో మరో విషాదం జరిగింది. తాడిచెర్ల చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ వరుణ్ (12) అనిల్ (10) అనే అన్నదమ్ములుగా గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేకలు కాయడానికి వెళ్లిన చిన్నారులు చెరువులో శవాలై తేలారు. ఒకరు చెరువులో జారిపడగా.. అతనిని కాపాడే ప్రయత్నంలో మరొకరు కూడా చెరువులోకి దూకారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృత దేహాలను వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టంకు పంపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..