Telangana: ఓటు హక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం.. సంకల్ప పత్రాలతో విద్యార్థులకు అవగాహన..

| Edited By: Srikar T

Apr 13, 2024 | 1:45 PM

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం. పారదర్శక పాలన కావాలన్నా.. మంచి నాయకులు పరిపాలించాలన్నా ఓటుతోనే సాధ్యం. అలాంటి బృహత్తర బాధ్యతను గుర్తుచేస్తూ.. ఓటు హక్కు వినియోగంపై సంకల్ప పత్రాల పేరుతో పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి ఎన్నికలైనా ఓటు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగంపై చైతన్య పరిచే దిశగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Telangana: ఓటు హక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం.. సంకల్ప పత్రాలతో విద్యార్థులకు అవగాహన..
Ec Awareness Program
Follow us on

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం. పారదర్శక పాలన కావాలన్నా.. మంచి నాయకులు పరిపాలించాలన్నా ఓటుతోనే సాధ్యం. అలాంటి బృహత్తర బాధ్యతను గుర్తుచేస్తూ.. ఓటు హక్కు వినియోగంపై సంకల్ప పత్రాల పేరుతో పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి ఎన్నికలైనా ఓటు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగంపై చైతన్య పరిచే దిశగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ర్యాలీలు, అవగాహన సదస్సులు వంటి అవగాహన కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ చేపడుతోంది. అయితే యాదాద్రి జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేసింది. రాజపేట పాఠశాల విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలని ఆకాంక్షిస్తూ వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు.. అని కరపత్రాలను ముద్రించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి.. తమ తల్లిదండ్రులతో చదివించి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన సంకల్ప కరపత్రాలను ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ సంకల్ప పత్రాలను ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులతో చదివించాలని టీచర్లు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. సంకల్ప కరపత్రాల్లో ముద్రించారు. పోలింగ్ రోజున మరోసారి గుర్తు చేస్తామని విద్యార్థుల బాధ్యతను కూడా ఈ సంకల్ప పత్రాల్లో ముద్రించారు. ప్రజాస్వామ్య మనుగడకు, దేశాభివృద్ధికి ఓటు మూలస్తంభం లాంటిదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో స్వీప్‌ కార్యక్రమం ద్వారా ఓటు వినియోగంపైనా, ప్రాధాన్యతపైనా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రులను చైతన్య పరిచే దిశగా చేపట్టిన కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం పట్ల అధికారులను అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..