ఆదిశగా ఇది మొదటి అడుగు : కేసీఆర్
రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు, లోపాల నిర్మూలనకు ఇది తొలి అడుగు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ దిశగా చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టమని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సమైక్య రాష్ర్టంలో..
రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు, లోపాల నిర్మూలనకు ఇది తొలి అడుగు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ దిశగా చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టమని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సమైక్య రాష్ర్టంలో 160 నుంచి 170 వరకు చట్టాలు ఉండేవన్న సీఎం.. ప్రస్తుతం తెలంగాణలో 87 చట్టాలు ఉన్నాయని తెలిపారు. ధరణి మాత్రమే కాదని.. మిగతా చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. ‘ఆర్వోఆర్, ధరణి సర్వస్వం కాదు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నాం’అని సీఎం స్పష్టం చేశారు. ‘నూతన రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఇది ఆరంభం మాత్రమే’ అని కేసీఆర్ తెలిపారు. చట్టంలో అన్నీ తీసేయడం లేదన్న ఆయన.. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందన్నారు. ప్రజలకు ఇబ్బంది కల్గించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. గ్రామాల్లో ఎవరి జీవితం వారే సాగిస్తున్నారన్న కేసీఆర్.. గ్రామాల్లో భూవివాదాలు చాలా తక్కువని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఈ చట్టంపై సభ్యులందరూ ఉత్తమమైన సలహాలు ఇచ్చారని.. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు అని కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు 57 లక్షల 90 వేలమంది రైతులకు రైతుబంధు అందించామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. కేవలం 28 గంటల్లో రూ. 7,200 కోట్లు రైతులకు అందించగలిగామని వెల్లడించారు.