Monkeys: దారుణం.. కర్రలతో కోతులపై దాడికి దిగిన గ్రామస్థులు. గోదావరిలో దూకిన వందలాది వానరాలు.

|

Sep 09, 2021 | 1:11 PM

Monkeys: నిర్మల్‌ జిల్లాలో దారుణం జరిగింది. కొందరి అనాలోచిత నిర్ణయంతో వందలాది కోతుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. పంటలపై దాడులు చేస్తున్నాయంటూ రెండు గ్రామాల ప్రజలు కోతులను...

Monkeys: దారుణం.. కర్రలతో కోతులపై దాడికి దిగిన గ్రామస్థులు. గోదావరిలో దూకిన వందలాది వానరాలు.
Follow us on

Monkeys: నిర్మల్‌ జిల్లాలో దారుణం జరిగింది. కొందరి అనాలోచిత నిర్ణయంతో వందలాది కోతుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. పంటలపై దాడులు చేస్తున్నాయంటూ రెండు గ్రామాల ప్రజలు కోతులను తరిమికొట్టడంతో ఎటు వెళ్లాలో తెలియని ఆ మూగ జీవాలు నీటిలో దూకాయి. ఆ దారుణ సంఘటన ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తోంది. కనీస ఆలోచన లేకుండా గ్రామస్థులు చేసిన చర్యపట్ల జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. గోదావరి నదిపై నిమాజామాబాద్, నిర్మల్‌ జిల్లాలను కలుపుతూ కమల్‌ కోట్‌ వద్ద ఓ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి ఆధారంగా చేసుకొని నిర్మల్‌ నుంచి వందల సంఖ్యలో కోతులు నిజామాబాద్‌ జిల్లాలోని గుమ్మిర్యాల్‌ గ్రామానికి చేరుతున్నాయి. ఇలా పెద్ద సంఖ్యలో వచ్చిన కోతులు గుమ్మిర్యాల్‌ గ్రామంలోని పంటలపై దాడి చేస్తున్నాయని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా బుధవారం తమ పొలాలపై కోతులు దాడి చేస్తున్నాయనే కారణంతో.. గుమ్మిర్యాల్‌ రైతులు కర్రలతో పెద్ద సంఖ్యలో కోతులను తరుముతూ వెళ్లారు. దీంతో కోతులన్నీ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో గుమ్మిర్యాల్‌లోని గోదావరి వంతెనపై నుంచి నిర్మల్‌ కమల్ కోట్ వైపు పరుగులు పెట్టాయి. ఈ సమయంలోనే బ్రిడ్జికి అవతలి వైపు ఉన్న నిర్మల్‌ జిల్లాకు చెందిన రైతులు కూడా కోతులపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియని కోతులు బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకేశాయి. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద ఉధృతికి కోతులు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

తీవ్రంగా ఖండిస్తోన్న జంతు ప్రేమికులు..

గ్రామస్థుల అనాలోచిత నిర్ణయాన్ని జంతు ప్రేమికులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. కోతులను పట్టుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నా వాటిని అన్వేషించకుండా ఇలా దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. కోతుల మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే కోతుల బెడదపై చర్యలు తీసుకోని అధికారుల తప్పు కూడా ఉందని ఆరోపిస్తున్నారు. కోతుల బెడద ఉంటే నిర్మల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సారంగాపూర్ మండలం చించోలి (బి) ద‌గ్గర‌ ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ,  పునరావాస కేంద్రానికి తరలించే అవకాశం ఉన్నా.. ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.

నరేష్ స్వేన
ఉమ్మడి ఆదిలాబాద్, టీవి9

Also Read: Bank Robbery: మిడ్‌నైట్‌లో బ్యాంక్ చోరీకి ప్లాన్.. విఫలమైన భార్యా భర్తలు.. అసలేం జరిగిందంటే..

Viral Video: స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే.. మనసులు దోచుకుంటున్న ట్రాన్స్‌జెండర్ నగల ప్రకటన.. వీడియో వైరల్

Telangana High Court: ఆ వినాయకులకు అక్కడ అనుమతి లేదు.. గణేశ్‌ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు..