రైతుల నిరసనకు మద్దతు, పార్లమెంటరీ కమిటీలకు ఆర్ ఎల్ పీ చీఫ్ హనుమాన్ బెనివాల్ రాజీనామా, స్పీకర్ కు లేఖ
రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బెనివాల్ మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా చేశారు. నాగౌర్ ఎంపీ అయిన ఈయన..
రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బెనివాల్ మూడు పార్లమెంటరీ కమిటీలకు రాజీనామా చేశారు. నాగౌర్ ఎంపీ అయిన ఈయన..తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపుతున్నానంటూ సంబంధిత లేఖను తన ట్విట్టర్లో పొందుపరిచారు. రైతుల కష్టాలు, వారి ఆందోళన గురించి ఈ పార్లమెంటరీ పానెల్స్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఇన్ని రోజులుగా అన్నదాతలు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టలేదన్నారు. ఇండస్ట్రీ స్టాండింగ్ కమిటీలోను, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీలోను, పిటిషన్లపై గల పానెల్ లోను బెనివాల్ సభ్యుడిగా ఉన్నారు. రాజస్తాన్ అసెంబ్లీలో ఈ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కి ఆర్ ఎల్ పీ మిత్ర పక్షంగా ఉంది. అవసరమైతే ఎన్డీయే నుంచి కూడా వైదొలుగుతామని హనుమాన్ లోగడ ప్రకటించారు.
తనతో బాటు రాజస్తాన్ కు చెందిన వేలాది అన్నదాతలు సింఘు బోర్డర్లో ధర్నా చేస్తున్న రైతుల ఆందోళనలో పాల్గొంటారని ఆయన ఆ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టువిడుపులకు పోకుండా రైతుల సమస్యను పరిష్కరించాలని హనుమాన్ బెనివాల్ డిమాండ్ చేస్తున్నారు.
आज किसान आंदोलन के समर्थन में व लोकहित के मुद्दों को लेकर संसद की 3 समितियों के सदस्य पद से त्याग पत्र लोकसभा अध्यक्ष श्री @ombirlakota को प्रेषित किया ! pic.twitter.com/LroTomvuYa
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) December 19, 2020