
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు.. వారం ముందు నుంచే ఆ ఏజెన్సీలో సందడి మొదలైపోతుంది. పండుగకు కావాల్సిన సరుకుల కోసం ఏకంగా ఓ సంతే ఏర్పాటవుతోందక్కడ. పేరుకి సంతే అయినప్పటికీ.. అది గిరిజనుల మధ్య అనుబంధం, ఆప్యాయతలు పెంచుకునే వేదిక. వస్తు మార్పిడి విధానంలో ఈ సంతలో సరుకుల కొనుగోళ్లు అమ్మకాలు. అలా తారుమారు సంతగా పేరుగాంచింది. సాంప్రదాయ 'జోరా' ఆ సంతలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఆ తారుమారు సంత విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా మరి..

అల్లూరి ఏజెన్సీలో జి మాడుగులలో తారుమారు సంత ఉత్సాహంగా సాగింది. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు జి మాడుగులలో తారుమారు సంత నిర్వహించడం ఆనవాయితీ. గిరిజనులు పండించిన పంటలను సంతకు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి... పండక్కి కావలసిన సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా వేరువేరు ప్రాంతాలకు చెందిన గిరిజనులంతా ఒక చోట చేరి సరదాగా గడుపుతారు. పండక్కి రావాలని బంధువులకు ఆహ్వానిస్తారు.

ఈ సంతకు మరో విశేషం ఉంది. తారుమారు సంతకు తరలివచ్చిన గిరిజనులు తమ బంధువులు స్నేహితులను పిల్లలతో పరిచయం చేసుకుంటారు. యుక్త వయసు వచ్చే పిల్లల పెద్దలు వారి బంధుత్వాల కోసం మాట్లాడుకుంటారు. ఇదే సమయంలో పెళ్లి సంబంధాలు కూడా చూసుకుంటారు. బంధుత్వాలు కుదుర్చుకున్న కుటుంబాలు సంక్రాంతి పండక్కి ఒకరికి ఒకరు ఆహ్వానించుకుంటామని అంటున్నారు జిమడుగులకు చెందిన బుజ్జినాయుడు. తారుమారు సంతలో ప్రత్యేకమైనది 'జోరా'. అది మర్యాదపూర్వకమైన పలకరించే పద్ధతి. సంతకు వచ్చిన బంధువులు ఎదురుపడినప్పుడు.. మర్యాదపూర్వకంగా ముందుకు వంగి నమస్కరించడమే జోరా. ఇలా ఈ సంతలో ప్రత్యేకంగా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కేవలం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కాక... ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గిరిజనులు ఈ సంతకు హాజరవుతూ ఉంటారని అంటున్నారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు.

తారుమారు సంతని మత్స్యరాస కుటుంబీకులు సాంప్రదాయంగా నిర్వహిస్తారు. పూర్వం ఇక్కడ వస్తు మార్పిడి విధానం ఉండేది. పండిన పంటలు సరుకులు తీసుకొచ్చి.. వాటిని అమ్మే ఆ డబ్బులతో పండక్కి కావాల్సిన సరుకులు గిరిజనలు కొనుగోలు చేసి ఇళ్లకు తిరిగి వెళ్లేవారు. రాను రాను పరిస్థితి మారిపోయింది. గిరిజనులు పంటలు అమ్మి ఆ డబ్బులతో వస్తువులు కొనుగోలు చేసి వెళ్తున్నారు. అయితే ఈసారి పంటలు కూడా తగ్గిపోవడంతో సంతలో వ్యాపారం ఆ స్థాయిలో లేదని అంటున్నాడు మైదాన ప్రాంత వ్యాపారి విశ్వనాథం.

అయినప్పటికీ.. తారుమారు సంతకు రావాలంటే గిరిజనుల ప్రత్యేక ఆసక్తి. ఏడాది కోసారి మాత్రమే జరిగే ఈ సంతకు ఎలాగైనా సరే హాజరై.. సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు గిరిజనలు. ఒకరికొకరు పలకరించుకుని... అవసరమైన సరుకులు కొనుగోలు చేసి సరదాగా పండుగ చేసుకుంటారు. ఈ వారం అంతా ఏజెన్సీలో సంక్రాంతి సందడే. ఎందుకంటే క్యాలెండర్ ప్రకారం వచ్చిన తేదీలకంటే వారం ముందే ఏజెన్సీలో సంక్రాంతి జరుపుకుంటారు.