
అనకాపల్లి జిల్లాలో మైన్స్ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడు సర్వేయర్ మురళి కృష్ణ. కార్యాలయం వెనకవైపు ఉన్న తోటలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ ఒకసారి ఏసీబికి పట్టుపడ్డాడు మురళీకృష్ణ. ఆ కేసు కోర్టులో ఉండగానే మరోసారి ట్రాప్ అయ్యాడు.

అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామం కొత్తపేట వీధికి చెందిన సునీల్ కుమార్. అనకాపల్లి మండలం వూడూరు గ్రామంలోని 2 హెక్టార్ల భూమికి సర్వే చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అనకాపల్లిలోని ఏడీ మైన్స్ అండ్ జియాలాజీ కార్యాలయాన్ని సంప్రదించాడు. అలాగే లీజు మంజూరు చేయాలని కోరాడు.

దీంతో రంగంలోకి దిగిపోయాడు మైన్స్ కార్యాలయంలో సర్వేయర్ గ్రేడ్-III గా పనిచేస్తున్న దాదాల మురళీ కృష్ణ. అనకాపల్లి జిల్లా ఏడీ గనుల ద్వారా కొన్ని పూర్తి చేయించేందుకు అధికారిక సహాయం చేస్తానని నమ్మ బలిగాడు. ఆటంకం లేకుండా ఫైలు కదలాలంటే 15లక్షల లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ మురళీకృష్ణ. తొలి విడతగా 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడని అన్నారు ఏసీబీ అడిషనల్ ఎస్పీ హర్షిత.

ఈలోగా ఈరోజు లంచం తీసుకునేందుకు టైం, ప్లేస్ ఫిక్స్ చేశాడు మురళీకృష్ణ. మైన్స్ కరాలయం వెనుక ఉన్న తోటలో లంచం డబ్బులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే అక్కడ మాట వేసిన ఎసిబి అధికారులు.. బాధితుడు నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అడిషనల్ ఎస్పీ హర్షిత నెహ్రత్వంలోని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం అవినీతి సర్వేయర్ మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి.

నిందితుడైన మురళీకృష్ణ.. 2008లో సర్వేయర్గా నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, పాడేరులలో పనిచేసి, గ తేడాది జూలై 4వ తేదీ నుండి అనకాపల్లిలో పనిచేస్తున్నారు. నిందితుడైన డి. మురళీకృష్ణ.. 2018 లోనూ ట్రాప్ కేసులో బుక్ అయ్యాడు. అప్పట్లో 50వీలు లంచంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అప్పట్లో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ తర్వాత.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు 2021లో మళ్లీ సస్పెండయ్యడు. 2023లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మళ్లీ తాజాగా లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు.