Mukhtar Abbas Naqvi resigns: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న ఆయన రాజ్యసభ సభ్యత్వం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించారు. కేంద్ర మంత్రి పదవికి నఖ్వీ రాజీనామా నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యంపై హస్తిన వర్గాల్లో కొత్త చర్చ నడుస్తోంది. త్వరలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవి కాలం ముగియనుండగా.. కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ గత వారం విడుదలైంది. ఎన్డీఏ తరుపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నఖ్వీని బరిలో నిలిపే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చొబెట్టాలని మోడీ-షా ద్వయం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా బీజేపీలో పలు హోదాల్లో నఖ్వీ ఆపార్టీకి సేవలందించారు. పార్టీకి అత్యంత విశ్వసనీయమైన మైనారిటీ నేతగా నఖ్వీ.. పార్టీ పెద్దల మన్ననలు పొందారు.
గల్ఫ్ దేశాలతోపాటు మిగిలిన ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నఖ్వీ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజ్యసభ పదవి కాలం ముగియనుండటంతో జెడి(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్సిపి సింగ్ కూడా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్సీపీ సింగ్కు జేడీయూ మరోసారి రాజ్యసభ పదవి ఇచ్చేందుకు నిరాకరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి