ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ బుధవారం ఉదయం నుంచి తమిళనాడు రాజధాని చెన్నైలోని సూపర్ శరవణ స్టోర్స్కు చెందిన 14 స్థలాల్లో సోదాలు చేస్తోంది. ఈ సోదాల్లో 100 మందికి పైగా ఐటీ అధికారులు పాల్గొన్నారు. చెన్నైలో ఎనిమిది చోట్ల తనిఖీలు నిర్వహిస్తుండగా.. కోయంబత్తూరు, మదురై సహా ఇతర జిల్లాల్లో ఆరుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.
చెన్నైలోని పురసవల్కంలోని సూపర్ శరవణకు చెందిన వస్త్ర దుకాణం, టీ నగర్, క్రోమ్పేట్లోని కిరాణా, ఫర్నీచర్ దుకాణాల్లో సోదాలు జరిగాయి. సోదాల సమయంలో అధికారులు కస్టమర్లను స్టోర్లలోకి అనుమతించలేదు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. సాయంత్రం వరకు దాడులు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడే అధికారులు పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. శరవణ స్టోర్స్ పన్ను ఎగవేసినట్లు పలు ఫిర్యాదులు అందడంతో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Read Also.. PMFBY Scheme: రైతులకు ముఖ్య సూచన.. డిసెంబరు 31లోపు పంట బీమా చేయించుకోండి.. లేకుంటే ఈ ప్రయోజనం పొందలేరు!