Heavy Rainfall: నీటిలోనే నానుతున్న చెన్నై.. మరో వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ..
చెన్నైనీటిలోనే నానుతోంది. నిత్యావసరాలు తెచ్చుకోవాలంటే పడవలే మార్గం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం..యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Chennai Rains: చెన్నై శివారులో కాలనీలు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు స్థానికులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల అపార్ట్మెంట్ల సెల్లార్ పూర్తిగా నిండిపోవడం, నడుములోతు నీరు ఉండడంతో బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల చెరువులు నిండిపోయాయి, వరద నీరు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రహదారులు తెగిపోయాయి. వరద ప్రాంతాల్లో అధికారులు జనాలకు బోట్ల సాయంతో నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో తమిళనాడులో మరోసారి భారీ వరదలు ముంచెత్తాయి. చెన్నై సహా తూత్తుకుడి, తిరునల్వేలి, విరుద్నగర్, శివగంగ, దిండిగుల్, మధురైలో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి.
రాష్ట్రంలో వర్షాలకు ఎనిమిది మంది మృతి చెందినట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చింగ్లేపేట, కాంచీపురంలో సహాయ చర్యలు అందిస్తున్నాయి. మొత్తం 109 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చెన్నై సహా 21 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
తమిళనాడు తీరంలో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ విభాగం ప్రకటించింది. వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో CM స్టాలిన్ పర్యటించారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక అధికారులను నియమించారు. పంట, ఆస్తి నష్టంపై గవర్నర్కు నివేదిక అందించారు.
ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..