Cyclone Yaas: వేగంగా దూసుకొస్తున్న యాస్ తుపాను.. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలను హెచ్చరించిన ఆరోగ్య శాఖ
Cyclone Yaas Approaches: యాస్ తుపాను వేగంగా దూసుకొస్తోంది. దేశాన్ని మరో రెండు రాష్ట్రాలను మరోసారి చుట్టేస్తోంది. ముంచేసేందుకు రెడీ అవుతోంది.
యాస్ తుపాను వేగంగా దూసుకొస్తోంది. దేశాన్ని మరో రెండు రాష్ట్రాలను మరోసారి చుట్టేస్తోంది. ముంచేసేందుకు రెడీ అవుతోంది. పశ్చిమ తీరాన్ని వణికించిన టౌత్టే అత్యంత తీవ్ర తుపాను బలహీనపడిన కొద్దిరోజులకే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడబోతోంది. ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనంగా మారుతోంది. అది వాయవ్యదిశగా కదులుతూ వాయుగుండంగాను, ఆపై తీవ్ర వాయుగుండంగాను బలపడి సరిగ్గా ఈనెల 24న తుపానుగా మారుతుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ మరింతగా తీవ్రరూపం దాల్చి ఈ నెల 26 ఉదయానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ల మధ్య తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (IMD) శుక్రవారం ప్రకటించింది.
దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను ఉంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.
అత్యవసర మందులను నిల్వచేసుకోండి- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
ఈ నెల 24 వ తేదీ కల్లా తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించినందున ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంతంలో ఉన్న అయిదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ నెల 26న ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు.
దీనివల్ల ఒడిశా, పశ్చిమబెంగాల్లో తుపాను తలెత్తడంతో పాటు, తూర్పు కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదమున్నట్లు అప్రమత్తం చేశారు. ఇప్పటికే కొవిడ్తో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ప్రజారోగ్యంపై ఇప్పుడు నీళ్లు, దోమలు, గాలిద్వారా సంక్రమించే రోగాలు మరిన్ని సవాళ్లు విసిరేలా ఉన్నాయని హెచ్చరించారు. అందువల్ల అత్యవసర మందులను నిల్వచేసుకోవాలని.. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.