Maharashtra Lockdown Extends: పెరుగుతున్న కరోనా కేసులు.. జనవరి 31 వరకు లాక్డౌన్ ఆంక్షలు పొడిగింపు
Maharashtra Lockdown Extends:దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ....
Maharashtra Lockdown Extends:దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు 2021 జనవరి 31 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలో రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలను జనవరి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు అని ప్రభుత్వం ఒక ప్రటకనలో తెలిపింది.
రాష్ట్రంలో కొత్త కరోనా వైరస్ లేదు
కాగా, తాజాగా యూకేలో మొదలైన కొత్త స్ట్రైయిన్ వైరస్ దేశంలోకి వ్యాపించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త వైరస్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని రాష్ర్ట వైద్యాధికారులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి యూకే నుంచి వచ్చిన వారిలో 30 మందికి కరోనా పాజిటివ్ తేలిందని, కానీ వారిలో ఎవరికి కూడా కొత్త కరోనా వైరస్ సోకలేదని తెలిపారు.
వాటికి లాక్డౌన్ ఆంక్షలు సడలింపు
ఇక ఇప్పటికే అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక లాక్డౌన్ పరిమితులను సడలించింది. నవంబర్లో ప్రార్థనా మందిరాలను తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే 9 నుంచి 12వ తరగతి వరకు విద్యాసంస్థలు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి తెరుచుకున్నాయి.
తాజాగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు
దేశంలో అత్యధిక కేసులు నమోదువుతన్నరాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ప్రస్తుతం రాష్ట్రంలో 19,25,066 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మంగళవారం ఒక్క రోజే 3,018 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అక్కడ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా 69 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మహారాష్ట్రలో మరణాల సంఖ్య 49 వేలు దాటేసింది. ప్రస్తుతం 54వేలకుపైగా కేసులు యాక్టివ్ కేసులున్నాయి.