Shri Saibaba: రికార్డు స్థాయిలో షిర్డీ సాయిబాబా హుండీ ఆదాయం.. యాదాద్రి ఆలయానికి కూడా గతంలో లేని విధంగా
తిరుమల హుండీ ఆదాయం విషయం పక్కన పెట్టండి. అది ఎప్పుడూ నిత్య కల్యాణం పచ్చని తోరణం. అయితే షిర్టీ సాయినాథుడి ఆలయం, యాదాద్రి స్వామి ఆలయాలకు కూడా రికార్డు స్థాయి హుండీ ఆదాయం వస్తుంది.
దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా దేవాలయంకు కూడా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరుతోంది. కరోనా తర్వాత ఆంక్షలు సడలించడంతో షిర్డీ సాయినాథుడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ నవంబర్ వరకు బాబా సంస్థాన్కు రూ.398 కోట్ల కానుకలు వచ్చాయి. షిర్డీ సాయినాథుడికి వచ్చిన కానుకల్లో 27 కిలోల బంగారం, 3,056 కిలోల వెండితో పాటు డీడీలు, చెక్కులు, నగదు ఉన్నాయి. విరాళాల రూపంలో రూ.77,89,04,984, హుండీలో కానుకల రూపంలో రూ.1,68,88,52,560, చెక్కులు, డీడీల రూపంలో రూ.19,68,41,408, డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ ద్వారా రూ.42,00,42,120, మనీ ఆర్డర్ల ద్వారా రూ.2,29,76,564 నగదు సాయినాథుడికి చేరింది.
భారత దేశంలో తిరుపతి తరువాత అత్యధిక మంది దర్శించుకునే దేవాలయం షిరిడి. కరోనా తరువాత షిరిడీ దేవాలయాన్ని దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. సాయినాథుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో షిరిడీ సాయినాథుడి ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొత్తానికి మూడు ఆలయాల్లో భక్తుల రద్ధీ పెరుగుతూ.. హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది.
పెరిగిన యాదాద్రి టెంపుల్ ఆదాయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో నిండిపోతోంది. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో… భక్తులు అధికసంఖ్యలో శ్రీస్వామిని దర్శించుకునేందుకు… తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చారు. దీంతో శ్రీస్వామివారికి రికార్డుస్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆదాయం విషయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఆదివారం రెండో సారి అత్యథిక ఆదాయంతో రికార్డు సాధించింది. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. శ్రీస్వామి వారి నిత్య ఆదాయం గత ఆదివారం రూ.1.09 కోట్లు రాగా, ఈ ఆదివారం దానికి అదనంగా రూ. 6,31,531 ఆదాయం వచ్చింది.
మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చదవండి